వికారాబాద్ జిల్లా దోమ మండలంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడని ఆర్ఎంపీ క్లీనిక్ ముందు అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాతి నొప్పితో భాదపడుతూ పరిగిలోని ఆర్ఎంపీ డాక్టర్ గఫార్ దగ్గరకు వెళ్లాడు ఊటుపల్లికి చెందిన బంటు శ్రీనివాస్. వైద్య పరీక్షలు చేసి కొన్ని మందులు ఇచ్చారు ఆర్ఎంపీ డాక్టర్. మందులు వేసుకున్న పదినిమిషాల్లో కుప్పకూలిపోయాడు శ్రీనివాస్. వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు డాక్టర్లు.
అయితే ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం వల్లే శ్రీనివాస్ చనిపోయాడని క్లీనిక్ వద్ద ఆందోళనకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. ఆర్ఎంపీతో వాగ్వాదానికి దిగారు. శ్రీనివాస్ మృతికి కారణమైన ఆర్ఎంపి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సాధారణ మందులిచ్చి పంపించానని చెబుతున్నాడు ఆర్ఎంపీ డాక్టర్. శ్రీనివాస్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు.
ALSO READ :- రాడిసన్ పబ్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్
అయితే శ్రీనివాస్ తీయించుకున్న ఇసిజిని ఆర్ఎంపి డాక్టర్ మరో డాక్టర్ కు వాట్సాప్ చేయగా అంతా నార్మల్ అంటూ మెసేజ్ పెట్టి ట్రీట్మెంట్ చేసినట్టు వాట్సప్ చాట్ బయటకు వచ్చింది. ఆ తర్వాత మందులు రాయడం వాటిని వెంటనే శ్రీనివాస్ వేసుకోవడం పది నిమిషాల్లో పడిపోవడం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఆందోళనతో తనపై కేసు కాకుండా కొంత డబ్బు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి.