
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద తవేరా కారు అదుపుతప్పి వాగులో పడిపోయి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
కాకుమాను గ్రామానికి చెందిన కొందరు తవేరా కారులో ఆదివారం ఏటుకూరులో ఓ శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. పుల్లడిగుంట దగ్గర కారు ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకుని వాళ్లు సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్లో తీసుకెళ్తుండగా వారిలో ఒకరు మరణించగా.. మిగిలిన ఐదుగురు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగంతో వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును గుద్దడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతులు వీరే: కారు డ్రైవర్ సమాదుల శ్రీను (50), సమాధుల వన్నూరు (55), సమాధుల సీతమ్మ (65), పొగడ్త వీరలక్షి (48), పొగడ్త రమణ (48), మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.