- కోట్లలో నష్టం..
- లక్షల్లో ఫండ్స్ కేటాయింపు
- ఇబ్బంది పడుతున్న జనం
ఇది ఆదిలాబాద్ – జందాపూర్ రోడ్డు. కిలో మీటర్ వరకు ఉన్న ఈ రహదారిపై దాదాపు 15 గుంతలు ఉన్నాయి. దీనిపై వాహనాల సంగతి దేవుడెరుగు... కనీసం కాలినడకనా వెళ్లలేని పరిస్థితి. రిపేర్ చేయించాలని స్థానికులు కోరుతున్నా.. పట్టించుకునే నాథులు కరువయ్యారు. జిల్లాలో అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఇట్లే ఉంది.
ఆదిలాబాద్, వెలుగు: గత నెలలో కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పంటలు, రోడ్లు, వంతెనలు, ఇండ్లు, భగీరథ పైప్ లైన్లు ధ్వంజమయ్యాయి. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. కొన్ని కోతకు గురయ్యాయి. దాదాపు రూ. 423 కోట్ల నష్టం జరిగిందని ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి ఆఫీసర్లు వివరించారు. నెల రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఒక్క రోడ్డు కూడా రిపేర్కు నోచుకోలేదు. మళ్లీ వర్షాలు పడితే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. అయితే దెబ్బతిన్న రోడ్ల రిపేర్ కోసం ప్రభుత్వం రూ. 82 లక్షలు రిలీజ్చేసింది. మరో రూ.16 లక్షలు కలెక్టర్ ఫండ్స్ నుంచి ఖర్చుచేయాలని ఆదేశించింది.
రిపేర్ చేస్తలేరు..
జైనథ్ మండలం ఆనంద్పూర్గ్రామం వద్ద పెన్ గంగా నదిపై ఉన్న బ్రిడ్జి వర్షాలకు దెబ్బతిన్నది. ఇచ్చోడలో ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లే రోడ్డుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అయితే గవర్నమెంట్నుంచి రిలీజ్అయిన డబ్బులతో ఈ రెండు వంతెనల పనులు మాత్రమే చేయించారు. మిగతా రోడ్ల పరిస్థితి అట్లే ఉంది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించాలని స్థానికులు
కోరుతున్నారు.
అమ్మో... ఇదేం రోడ్డు!
భైంసా,వెలుగు: మొన్నటి వర్షాలకు ముథోల్ – ధర్మాబాద్ రోడ్డు అధ్వానంగా మారింది. ఎల్వత్ రోడ్డు, వంతెన కోతకు గురయ్యాయి. ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ముథోల్ టు ఎల్వత్ మీదుగా ధర్మబాద్ 9 కిలో మీటర్లు ఉండగా.. 7 కిలో మీటర్ల రోడ్డు మొత్తం దెబ్బతిన్నది. మార్గమధ్యంలో రెండు బ్రిడ్జీల మధ్య పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముథోల్, తానూర్, భైంసా, లోకేశ్వరం మండలాల ప్రజలు వివిధ అవసరాల కోసం మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్తుంటారు. వ్యాపార, వాణిజ్య పనుల నిమిత్తం వేలాది మంది అటూ ఇటూ తిరుగుతుంటారు. రాత్రిపూట ఈ రోడ్డు వెంట ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు. ఇటీవల పలువురు గుంతల్లో పడి గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నరకం అనుభవిస్తున్నాం..
భారీ వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆఫీసర్లు ఏమో అక్కడక్కడ మొరం వేసి చేతులు దులుపుకుంటున్నారు. మళ్లీ వర్షం వస్తే అది కొట్టుకుపోతుంది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనాలు నడపాలంటేనే ఎక్కడపడిపోతామని భయపడుతున్నారు.
- అనిల్ రెడ్డి, ధనోర (బి)
రోడ్డు ఖరాబై ఏడాదైంది..
ముథోల్– ధర్మబాద్ రోడ్డు కోతకు గురైంది. నిరుడు ఎల్వత్వద్ద వంతెన కోతకు గురైంది. ఈసారి కురిసిన వర్షాలకు అది మరింత ప్రమాదకరంగా మారింది. అయినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. రోడ్డు రిపేర్కు చర్యలు తీసుకోవాలి.
- బాబూరావు, ఎల్వత్