
కోల్కతా: టీమిండియా సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వన్డేల్లో ఉన్న అద్భుతమైన రికార్డును దృష్టిలో ఉంచుకుని వాళ్లను కొనసాగించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఫామ్లో ఉన్నంతకాలం ఈ ఇద్దర్ని ఆడించాలని సూచించాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ ఈ ఇద్దరికి చివరి వన్డే సిరీస్ అని మీడియాలో వస్తున్న ఊహాగానాలపై దాదా పెద్దగా స్పందించలేదు.
‘మీడియాలో వస్తున్న అంశం గురించి నాకు తెలియదు. దీనిపై నేనేమీ వ్యాఖ్యానించలేను. కానీ కెరీర్ను కొనసాగించడానికి పెర్ఫామెన్స్ మాత్రమే నిర్ణయాత్మకం అంశం కావాలి. ఎవరు ఎలా ఆడతారో చెప్పడం కష్టం. ఇద్దరూ రాణిస్తే అలాగే కొనసాగించాలి. కోహ్లీ, రోహిత్ వన్డే రికార్డులు అసాధారణంగా ఉన్నాయి. వైట్బాల్ క్రికెట్లో వీళ్లకు తిరుగులేదు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇప్పటికే టెస్ట్, టీ20లకు గుడ్బై చెప్పిన రోకో ద్వయం వన్డేలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారా? లేదా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆసీస్, సౌతాఫ్రికాతో చెరో మూడు వన్డేల సిరీస్ తర్వాత 2026లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, మళ్లీ న్యూజిలాండ్తోనూ సిరీస్లు ఉన్నాయి. అప్పటి వరకు వీళ్ల ఫామ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్లో ఇండియా ఫేవరెట్ అని గంగూలీ వెల్లడించాడు.
‘ఐపీఎల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ తర్వాత ఇండియాకు మంచి విరామం లభించింది. ఇప్పుడు ఆసియా కప్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. రెడ్ బాల్ క్రికెట్లో బలంగా ఉన్నారు కాబట్టి వైట్ బాల్లోనూ దాన్ని కొనసాగిస్తారు. నా అభిప్రాయం ప్రకారం టీమిండియానే ఫేవరెట్. దుబాయ్ వికెట్లపై ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని దాదా వ్యాఖ్యానించాడు.
టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భవిష్యత్ ఆశాజనకంగా ఉందన్నాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో తాను రెండో ఇన్నింగ్స్కు రెడీగా ఉన్నానని చెప్పిన గంగూలీ.. సభ్యులు కోరుకుంటే క్యాబ్ ప్రెసిడెంట్ పోస్ట్కు నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. 2015 నుంచి 2019 అక్టోబర్ వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగాడు. తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్గా పని చేశాడు.