అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్తుండు : రఘునందన్ రావు

అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్తుండు : రఘునందన్ రావు

అయ్యప్పమాలలో ఉండి అబద్దాలు చెప్పడం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని తాము నమ్ముతామని, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికొస్తే నిజాలు మాట్లాడుతాడనుకున్నామని అన్నారు. విద్యార్హత విషయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని తాను అడిగితే, ఆ విషయం పక్కన పెట్టి, సంబంధం లేని వాటి గురించి మాట్లాడారని అన్నారు. రోహిత్ రెడ్డికి రాష్ట్రంతో గానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదన్నారు. తెలంగాణ వచ్చాక అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయిన ఆయన తన గురించి కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు.

2018 ఎన్నికల ప్రచారంలో దొరలు తిరిగే కారు కావాలా.. అన్నం తినే చేయి కావాలా అని రోహిత్ రెడ్డి అడిగిన విషయాన్ని రఘునందన్ గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ప్రజలు నమ్మి ఓటేసినందుకు అన్నం తినిపించిన చేయికి సున్నం పెట్టాడని, బీ ఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరి కలిపాడని విమర్శించారు. అయ్యప్ప మాలలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకంటే ఏం మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రోహిత్ రెడ్డి మాల తీసిన తర్వాత తాను ప్రతీ దానికి జవాబు చెప్తాడని రఘునందన్ స్పష్టం చేశారు. 

తనను సస్పెండ్ చేసినపుడు తనపై చేసిన ఆరోపణలు నిరూపించమంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదని రఘునందన్ రావు అన్నారు. తాను అక్రమంగా సంపాదించి ఉంటే.. ఇల్లీగల్ పనులు చేసుంటే.. ప్రగతి భవన్ గానీ, సీఎం ఆఫీస్ గానీ ఈ రోజు దాకా ఎందుకు విచారణ జరిపించలేకపోయిందని నిలదీశారు. తానే తప్పూ చేయనందునే సీఎం కూడా చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది కేసీఆర్, పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాలేనన్న రఘునందన్ రావు.. దమ్ముంటే 2013లో తనపై చేసిన ఆరోపణలను ఎప్పుడు రుజువు చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయమని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.