తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..మరోసారి సెంచరీలు ఖాయమా..?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..మరోసారి సెంచరీలు ఖాయమా..?

తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. ఆగస్టు 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ  భార్య, కూతురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నాడు. రోహిత్‌ శర్మ కుటుంబ సభ్యులకు  ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు రోహిత్‌ శర్మను సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో భార్యా పిల్లలతో కలిసి రోహిత్ శర్మ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. తిరుమలకు రోహిత్ శర్మ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అతన్ని గుమ్మిగూడారు. వారికి రోహిత్ శర్మ అభివాదం కూడా చేశాడు.

తిరుమల శ్రీవారిని రోహిత్ శర్మ  దర్శించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019 వరల్డ్ కప్ ముందు కూడా  రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ  ప్రపంచకప్ లో శతకాల మోత మోగించాడు. 5 శతకాలు బాదిన ఓ  ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన  ప్లేయర్ గా రికార్డులకెక్కాడు.  ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ తో కలిసి సమానంగా ఉన్నాడు.

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ రోహిత్ శర్మ తిరుమలకు  రావడం విశేషం. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లు జరగనున్నాయి. ఈ రెండు టోర్నీల్లోనూ టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండనున్నాడు. ఈ మెగా టోర్నీల్లో భారత జట్టు విజయం సాధించాలని  దేవుడిని ప్రార్థించేందుకు తిరుమలకు వచ్చి ఉంటాడని అభిమానులు అనుకుంటున్నారు.  ప్రస్తుతం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆగస్టు  30 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ లో ఆడనున్నాడు.  ఆసియా కప్ అనంతరం భారత్ వన్డే ప్రపంచకప్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది.