టొరంటో: ఫిఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ సంచలన విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన రౌండ్–32 మ్యాచ్లో 2–1 తేడాతో క్రొయేషియాపై గెలిచి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో (68వ ని), గొన్సాలో రామోస్ (90+4వ ని) పోర్చుగల్కు గోల్స్ అందించారు. క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ పెరిసిచ్ (53వ ని) ఏకైక గోల్ చేశాడు. ఆరంభం నుంచి ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి.
బంతిపై ఆధిపత్యం కోసం హోరాహోరీగా పోరాడటంతో తొలి హాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. సెకండాఫ్లో వ్యూహం మార్చిన క్రొయేషియా ఎదురుదాడులతో పోర్చుగల్ గోల్ పోస్ట్పైకి పదేపదే దూసుకుపోయింది. ఈ క్రమంలో పెరిసిచ్ ఫీల్డ్ గోల్ చేసి క్రొయేషియాను 1–0 ఆధిక్యంలో నిలిపాడు. దీంతో ఒత్తిడికి లోనైన పోర్చుగల్ అటాకింగ్ గేమ్ ఆడింది. దాంతో 68వ నిమిషంలో లభించిన పెనాల్టీని రొనాల్డో గోల్గా మలిచి స్కోరు సమం చేశాడు.
వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో రొనాల్డోకు ఇది తొలి గోల్ కావడం విశేషం. అదనపు టైమ్లో రామోస్ హెడ్డర్ ద్వారా గోల్ చేసి పోర్చుగల్ను 2–1 ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఆఖరి నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మారియో పసాలిచ్ బంతిని నెట్లోకి పంపాడు. కానీ వీఏఆర్ పరిశీలన తర్వాత రెఫరీ దాన్ని ఆఫ్సైడ్గా ప్రకటించడంతో పోర్చుగల్ విజయం ఖాయమైంది.
రెఫరీ నిర్ణయంపై క్రొయేషియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక గతేడాది కారు ప్రమాదంలో మరణించిన తన సహచర ఆటగాడు డియోగో జోటా జెర్సీని (నెం. 21) ధరించి రొనాల్డో మైదానంలోకి వచ్చాడు.
