న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన రెండో సప్లిమెంటరీ చార్జ్షీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గురువారం లిక్కర్ స్కాంపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతంలో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కోర్టు వెల్లడించింది.
అదేవిధంగా చార్జ్ షీట్ లో సీబీఐ నిందితులుగా పేర్కొన్న రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చరణ్ప్రీత్ సింగ్లకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న జరిగే తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని సమన్ల లో పేర్కొంది. లిక్కర్ స్కాంలో ప్రధాన కేసు విచారణను కూడా ఆగస్టు 22న చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.

