పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సూత్రధారి
సెర్ప్ డైరెక్టర్తో కలిసి అక్రమాలు.. సీఎంకు తెలిసే జరిగింది
బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్రావు ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కొండ పోచమ్మ సాగర్కు గండ్లు పడ్డట్టే రాష్ట్రంలోని పలు శాఖలకు అవినీతి గండ్లుపడ్డాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు ఆరోపించారు. ఇందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవినీతికి సూత్రధారి అన్నారు. సెర్ప్ డైరెక్టర్ అనంతంతో కలిసి 10 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్ యాప్లో మీడియాతో మాట్లాడారు. ‘‘గొర్రెల, మేకల పశు ఉత్పత్తి కోసం 2,875 మహిళా స్వయం సహాయక సంఘాలతో లైవ్స్టాక్ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ గ్రూప్లను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఆ సంఘాల్లో 75 శాతం గ్రూపులకు పశు పోషణతో సంబంధమే లేదు. పశు సంవర్థక శాఖ కింద గోపాల మిత్రలు పనిచేస్తున్నప్పటికీ, సెర్ప్లో పశు మిత్రలను నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లకు శిక్షణ పేరుతో 6 కోట్ల 50 లక్షల రూపాయలను, పరికరాల కొనుగోలు కోసం మరో 4 కోట్ల 7 లక్షల రూపాయలను కేటాయించారు’’ అని ఆయన ఆరోపించారు. టెండర్లు పిలవకుండానే పరికరాలు కొనాలని నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధమని, ఈ పద్ధతిలోనే వారు అవినీతికి తెరలేపారని అన్నారు.
సీఎంకు తెలిసే జరిగి ఉంటుంది
సీఎం కేసీఆర్ కు తెలిసే ఈ అవినీతి జరిగి ఉంటుందని తాను భావిస్తున్నట్టు పేరాల శేఖర్ రావు అన్నారు. ఈ స్కీం కోసం కేంద్రం 24 కోట్ల రూపాయల నిధులిచ్చిందన్నారు. పశు మిత్రలకు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ఆన్లైన్ శిక్షణ ఇచ్చారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కొత్త పథకాలు, కార్యక్రమాలను చేపట్టరాదని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ ఈ ఇద్దరు అధికారులు కేవలం కమీషన్ల కోసమే దీనిని ప్రారంభించారన్నారు. సెర్ప్ లో జరిగిన అవినీతిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. అసలు ఎంత మంది పశు మిత్రలు ఉన్నారో, వాళ్ల అడ్రస్ లతో సహా వెబ్సైట్లో పెట్టాలని, వారు ఏర్పాటు చేసిన గ్రూప్ల వివరాలను సైతం బయట పెట్టాలని శేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
For More News..