పెళ్లి జరుగుతుండగానే దొంగతనం

పెళ్లి జరుగుతుండగానే దొంగతనం

అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. ఓ దొంగ మాత్రం తన పనిలో బిజీగా ఉన్నాడు. పెళ్లి జరిగే లోపు ఏకంగా కోట్ల విలువైన నగలు దోచుకెళ్లాడు. ఈ ఘటన జైపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా తన కుమార్తె వివాహాన్ని జైపూర్‌లోని హోటల్ క్లార్క్స్ అమెర్‌లో అంగరంగవైభవంగా చేయాలని హోటల్ ను బుక్ చేసుకున్నారు. దాంతో భాటియ కుటుంబసభ్యులు ఏడో అంతస్తులో గదులు తీసుకున్నారు. వీరు గురువారం హోటల్ లాన్‌లో పెళ్లి జరిపిస్తుండగా.. దొంగ వీరికి చెందిన ఓ గదిలోకి దూరాడు. అక్కడి నుంచి రూ. 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు మరియు రూ. 95,000 చోరీ చేశాడు. పెళ్లి తర్వాత గుర్తించిన భాటియా.. హోటల్ సిబ్బంది సహకారంతో ఈ దొంగతనం జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అంతేకాకుండా హోటల్ మేనేజ్‌మెంట్ మరియు సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని జవహర్ సర్కిల్ ఎస్ హెచ్ఓ తెలిపారు.