న్యూఢిల్లీ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐసీ) నిబంధనలకు అనుగుణంగా తయారు చేసే బొమ్మలకు రూ. 3,500 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ఇన్సెంటివ్(పీఎల్ఐ)లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశీయంగా క్వాలిటీ బొమ్మల తయారీని పెంచడం, గ్లోబల్ మార్కెట్లో పోటీపడేలా చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం కోసం ఈ స్కీమ్ను అమలు చేస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బొమ్మల పరిశ్రమ కోసం ప్రభుత్వం నాణ్యత నియంత్రణ ఆర్డర్లను ప్రకటించడంతో పాటు కస్టమ్స్ డ్యూటీలను 20 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. దీనివల్ల నాణ్యత లేని దిగుమతులు తగ్గాయని, దేశీయ తయారీ పెరిగిందని అధికారి తెలిపారు. "ఇతర సెక్టార్లకు ఇచ్చినట్టే బొమ్మల కోసం పీఎల్ఐ ప్రయోజనాలను ఇస్తాం. బీఐసీ స్టాండర్డ్స్ ప్రకారం తయారైన బొమ్మలకు మాత్రమే ఇన్సెంటివ్స్ వర్తిస్తాయి. పీఎల్ఐ ప్రయోజనాలను వివిధ పెట్టుబడి స్లాబ్ల ప్రకారం ఇస్తారు. ఇవి కంపెనీని బట్టి రూ. 25 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు లేదా రూ. 100–-200 కోట్ల వరకు ఉంటాయి’’ అని ఆయన తెలిపారు. కంపెనీలు ఇప్పటికీ బొమ్మలను తయారు చేయడానికి కీలకమైన కొన్ని భాగాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కాబట్టి కాంపోనెంట్స్పై కాకుండా ఫుల్ప్రొడక్ట్పైనే ప్రోత్సాహకాలను అందించాలనేది ప్రతిపాదన. బీఐసీ అనేది భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ. ఇది భారత్లో తయారయ్యే వస్తువులకు ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రచురిస్తుంది. కన్ఫర్మిటీ (అనుగుణ్యత) అంచనా పథకాలను అమలు చేస్తుంది. కన్ఫర్మిటీ అసెస్మెంట్ కోసం ప్రయోగశాలలను నిర్వహిస్తుంది. హాల్మార్కింగ్ను అమలు చేస్తుంది. నాణ్యత హామీపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారత్లో తయారైన బొమ్మలు గ్లోబల్ బ్రాండ్లకు సరఫరా చేయడమే కాకుండా అక్కడి మార్కెట్లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.
మరికొన్నింటికీ పీఎల్ఐ స్కీమ్..
బొమ్మలతో పాటు, సైకిల్, చెప్పులు, కొన్ని టీకా పదార్థాలు, షిప్పింగ్ కంటైనర్లు, కొన్ని టెలికాం ఉత్పత్తులు వంటి ఇతర రంగాలకు కూడా పీఎల్ఐను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలపై మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ సహా 14 రంగాల కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. తయారీలో ప్రపంచ ఛాంపియన్లను సృష్టించడం, కోర్ కాంపిటెన్సీ, టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశాన్ని భాగం చేయడం ఈ పథకం లక్ష్యం.