నిజామాబాద్ లో నకిలీ బంగారంతో రూ.5 లక్షలు టోకరా

నిజామాబాద్ లో నకిలీ బంగారంతో రూ.5 లక్షలు టోకరా

నిజామాబాద్​, వెలుగు : మహిళకు నకిలీ బంగారాన్ని అంటగట్టి రూ.5 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లను పోలీసులు పట్టుకొని వారి నుంచి క్యాష్​ రికవరీ చేశారు. ఆదివారం నిజామాబాద్​ ఏసీపీ  రాజావెంకట్​రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. గుంటూర్​ జిల్లాకు చెందిన తురక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగారాజు మూడు నకిలీ బంగారం బిస్కెట్లు తయారు చేసి వాటిని అసలువిగా నమ్మించి అమ్మడానికి నిజామాబాద్​ నగరానికి నాలుగు నెలల క్రితం వచ్చారు. 

శివాజీనగర్​లో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దగ్గరలో మిల్క్ సెంటర్​ నడిపే మోర వనిత నుంచి ప్రతి రోజు ఉదయం పాలు కొనేవారు. ఈ రకంగా ఆమెతో పరిచయం పెంచుకొని కూలీ పనులు చేస్తుండగా బంగారు బిస్కెట్లు దొరికాయని, మార్కెట్​లో రూ.30 లక్షలు విలువ చేసే బిస్కెట్​ను రూ.10 లక్షలకు అమ్ముతామని ఆమెను నమ్మించారు. 

నిజమేనని నమ్మిన మోర వనిత రూ.5 లక్షలే ఇవ్వగలనని చెప్పగా సరేనని శనివారం బిస్కెట్ ఆమె చేతికిచ్చి క్యాష్​ తీసుకొని వెళ్లిపోయారు. తరువాత బిస్కెట్ టెస్ట్​ చేయించిన  వనిత అది నకిలీదని తేలడంతో లబోదిబోమంటూ 5వ టౌన్​లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తును వేగవంతం చేశారు. డిచ్​పల్లి రైల్వేస్టేషన్​లో నిందితులు ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల క్యాష్​, మరో రెండు నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకొని రిమాండ్​కు పంపారు. రూరల్​ సీఐ శ్రీనివాస్​, ఎస్సై గంగాధర్​ ఉన్నారు.