మందమర్రి,వెలుగు: నేషనల్ హైవే మంజూరయినట్టు తెలిసినా పట్టించుకోకుండా పాత రోడ్ల పక్కనే మిషన్ భగీరథ పైపులైన్లను వేశారు. హైవే పనులు మొదలు కావడంతో ఆ పైపులైన్లను మారుస్తున్నారు. దీనివల్ల రూ. 50 కోట్ల వరకు వృథా కాగా.. చాలా ఊళ్లకు మంచినీళ్లు ఇవ్వడం కష్టం కానుంది. ఇంటర్నల్ పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయినా మెయిన్ పైప్ లైన్ మారుస్తుండడం వల్ల ఆయా గ్రామాలకు నీరందించడంలో జాప్యం జరుగనుంది.
ఎన్హెచ్ 363 రెండు జిల్లాల్లో..
మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు కేంద్ర ప్రభుత్వం 2016లో కొత్తగా నేషనల్ హైవే 363 మంజూరు చేసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 94.6 కిలోమీటర్ల రోడ్డును ఫోర్లేన్గా మార్చేందుకు మొదటివిడతగా రూ.1700 కోట్లను కేటాయించింది. ఈ పనులను రెండు ప్యాకేజీల కింద చేపట్టనుంది. మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ జీఎం ఆఫీస్ నుంచి రేపల్లె వాడ వరకు మొదటి ప్యాకేజీ రోడ్డు పనులను రూ.1,042 కోట్లతో చేపడుతోంది. రేపల్లె వాడ నుంచి రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి మీదుగా మహారాష్ట్ర బార్డర్ వరకు రెండవ ప్యాకేజీ పనులను రూ.910 కోట్లతో చేపట్టనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి ప్యాకేజీ పనులను ఎంఆర్ఆర్పీఎల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేస్తోంది. మంచిర్యాల నుంచి రేపల్లెవాడ వరకు ఇప్పుడున్న ఆర్అండ్బీ రోడ్డును ఇరువైపుల విస్తరించే పనులు సాగుతున్నాయి. ఫోర్లేన్తో పాటు ఆర్వోబీలు, అండర్పాస్లు, సర్వీసు రోడ్లు, డివైడర్లు నిర్మాణం కోసం ప్రస్తుతం రోడ్డు పక్కనున్న వాటర్ సప్లై పైపులైన్లు, కరెంటు స్తంభాలు, హైటెన్షన్ టవర్లు, టాన్స్ఫార్మర్లను తొలగిస్తున్నారు.
ముందే తెలిసినా.. రోడ్డుపక్కనే పైపులైను
నేషనల్ హైవే మంజూరయిన విషయం తెలిసినా మిషన్ భగీరథ అధికారులు మూడేండ్ల కిందట పాత రోడ్ల పక్కనే పైప్లైన్లు వేశారు. ఆర్ అండ్బి రోడ్డుకు 30, 40 అడుగుల దూరంలోనే వేశారు. ఊళ్లలో కేవలం 20, 25 అడుగుల దూరంలోనే వేశారు. దీంతో ఇప్పుడు ఆ పైపులైన్లు హైవే కిందకు వస్తున్నాయి. భగీరథ పైపులైను వేసినప్పుడే నేషనల్ హైవే అధికారులు అభ్యంతరం తెలిపినా పంచాయతీరాజ్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. వాంకిడి మండలం గోయగాం నుంచి ఆసిఫాబాద్, రెబ్బెన, తాండూరు, బెల్లంపల్లి వరకు , మంచిర్యాలలోని ఎంసీసీ నుంచి మందమర్రి, బెల్లంపల్లి చర్చివరకు మొయిన్పైపులైనంతా రోడ్డు పక్కనే నిర్మించారు. ఈ ప్రాంతంలో విస్తరణ కోసం చేపట్టిన ప్రైమరీ వర్క్స్ నిలిపివేసి.. వెంటనే పైపులైను తొలగించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు స్పష్టం చేశారు. దీంతో సుమారు 54 కిలోమీటర్ల మేరకు మెయిన్ పైపులైన్లను తొలగించి.. రోడ్డుకు 100 అడుగుల దూరంలో కొత్తలైను వేయాలని పంచాయతీరాజ్ అధికారులు నిర్ణయించారు. మెయిన్ పైపులైను మార్చేందుకు దాదాపు రూ 50 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఊర్లల్లో ఇంటర్నల్ పైపులైన్ల పనులు పూర్తి అయ్యాయి. ట్యాంకుల నిర్మాణం తుదిదశకు చేరుకుంది. కొన్ని గ్రామాల్లో ట్రయల్స్ కూడా జరిగాయి. ఈ దశలో మెయిన్ పైపులైను మార్చడం వల్ల తాగునీటి సరఫరా మరింత లేట్కానుంది.
రూ. 50 కోట్లు వృథా
నేషనల్ హైవే 363 మంజూరైన విషయం తెలిసినా ఆర్అండ్బీ రోడ్డుపక్క 30 నుంచి 50 అడుగుల దూరంలో మొయిన్పైపులైను వేశారని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి, నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్ ఆరోపించారు. వారు పైపులైను పనులను పరిశీలించారు. పైపు లైను మార్చడంవల్ల రూ.50కోట్ల ప్రజాధనం దుబారా అవుతుందన్నారు. ఈ పనుల్లోనూ అధికార పార్టీ నాయకులు కమీషన్లు దండుకునే అవకాశం ఉందన్నారు.