కల్వకుర్తి పెండింగ్ పనులకు రూ.785 కోట్లు అవసరం.. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ ఆఫీసర్ల నివేదిక

కల్వకుర్తి పెండింగ్ పనులకు రూ.785 కోట్లు అవసరం..    సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ ఆఫీసర్ల నివేదిక

నాగర్​కర్నూల్, వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్​స్కీమ్ పెండింగ్​పనులు పూర్తి చేయడానికి రూ. 785 కోట్లు అవసరమని ఇరిగేషన్​ఆఫీసర్లు అంచనా వేశారు.  ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి రిపోర్ట్​అందజేశారు. కల్వకుర్తి కింద ప్రస్తుతం 3.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అదనంగా 86 వేల ఎకరాలకు సాగునీరందించి స్థిరీకరించాలని నిర్ణయించారు. 

ఈ స్కీమ్​కు సంబంధించి భూసేకరణ, పెండింగ్ పనులు, 29వ ప్యాకేజీ పనులు, 30వ ప్యాకేజీ విస్తరణ, ఎల్లూరు పంప్​హౌజ్​లో దెబ్బతిన్న రెండు పంపులు,హెడ్​రెగ్యులేటర్​ రిపేర్లకు దాదాపు రూ.785 కోట్లు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం రేవంత్​రెడ్డి ఆన్​గోయింగ్​ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ రిపోర్ట్​ పంపారు. 


కొత్తగా 86 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్


కల్వకుర్తి లిఫ్ట్​ స్కీం కింద నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల పరిధిలో 3.65 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. మరో 86 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్దం చేశారు. కొల్లాపూర్​మండలం రేగుమానుగడ్డ వద్ద ఎల్లూరు  పంప్​హౌజ్​అప్రోచ్​కెనాల్​కు ముందు హెడ్​రెగ్యులేటరీ నిర్మించాల్సి ఉండగా దాన్ని పక్కకు పెట్టారు. ఎల్లూరు పంప్​హౌజ్​రెండుసార్లు మునిగిపోగా  ఒక పంప్​ పూర్తిగా, మరో పంపు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

ఈ పంపులు, మోటర్ల రిపేర్లకు రూ.20 కోట్లు, పంప్​హౌజ్​పై వరద ఒత్తిడి నియంత్రించేందుకు హెడ్​రెగ్యులేటరీ నిర్మాణానికి రూ.30 కోట్లతో ప్రపోజల్స్​రెడీ చేశారు.  29వ ప్యాకేజీ, డీ82 కాలువ కింద దాదాపు 2.18లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మెయిన్​ కెనాల్​తోపాటు బ్రాంచ్​ కెనాల్స్, మైనర్లు, స్ట్రక్చర్ల నిర్మాణానికి దాదాపు రూ.600 కోట్లు అవసరమని అంచనా వేశారు. నాగర్​కర్నూల్, ​ అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీరందించే 30 వ ప్యాకేజీ విస్తరణకు రూ.35 కోట్లు అవసరం అవుతాయని, రెండు ప్యాకేజీల కింద భూసేకరణకు మరో రూ.100 కోట్లు అవసరమని అంచనా వేశారు.