కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆదిలాబాద్ ఎడారిగా మారింది : ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో  ఆదిలాబాద్ ఎడారిగా మారింది : ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్

కోల్​బెల్ట్​,వెలుగు: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్​చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. చెన్నూర్​బీఎస్పీ అభ్యర్థి డాక్టర్​దాసారాపు శ్రీనివాస్ కు మద్దతుగా క్యాతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బహుజనలంతా ఏకమై రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ను ఓడించాలని, ఆయన పాలనలో సింగరేణి కార్మికులు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా కట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి 2006 లో రూ.900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయినా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యంతోనే అన్ని వనరులున్నా చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు.  

సమావేశంలో ఆ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​ఎం.వెంకటేశ్​గుణ, జిల్లా ఇన్​చార్జి జాగిరి రాజేశ్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, విజయ్, జోనల్ మహిళా కన్వీనర్లు అర్చన, భవాని, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద తదితరులు పాల్గొన్నారు.