రాష్ట్ర పాడి రైతుల పొట్ట కొట్టేందుకే అమూల్కు పర్మిషన్
సీఎం కేసీఆర్ ‘కిసాన్ సర్కార్’నినాదం మోసం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ ‘కిసార్ సర్కా ర్’నినాదం రైతులను మోసం చేయడానికేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కిసాన్ సర్కార్ అంటే.. రాష్ట్రంలోని పాడి రైతుల పొట్టకొట్టడమేనా అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బీజేపీ, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాడుతున్నారనేది అబద్ధమని, వారి మధ్య బలమైన బంధం ఉందని ఆరోపించారు. అమిత్ షా ఆదేశాలతో గుజరాత్కు చెందిన అమూల్ పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారన్నారు.
ఈ విషయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలకు తెలియదని విమర్శించారు. ఇదే కంపెనీని కర్నాటకలో ఏర్పాటు చేసి, ఆ రాష్ట్రంలో ఉన్న నందిని పాల కంపెనీని మూసేయాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడి, అమూల్ కంపెనీని రానివ్వడం లేదని గుర్తుచేశారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం తన సొంత నియోజకవర్గం గజ్వేల్లోని వర్గల్లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్రతివాచీ పరిచారన్నారు.
రాష్ట్ర పాడి రైతులకు నష్టమని తెలిసినా..
అమూల్ కంపెనీ రాకతో రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా సీఎం పట్టించుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. రాష్ట్రంలో విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీలను చంపి, అమూల్ సంస్థను తెస్తున్నారని మండిపడ్డారు. . అలాగే, రావిర్యాల ఫ్యాక్టరీకి సహకారం అందించడం లేదని చెప్పారు. తన కూతురు కవితను ఈడీ విచారణ నుంచి కాపాడేందుకు కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఒక యువతిపై ఎస్సై దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.