- విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
మెహిదీపట్నం, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ఎదుట గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 60 లక్షల మంది పేద విద్యార్థులు బాల్యంలోనే సమాధులయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఉన్నత విద్యావంతులు కావాల్సిన పేద విద్యార్థులు ఉరితాళ్లకు బలవుతున్నారన్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సీఎం స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రతి గురుకుల పాఠశాలలో సైకాలజిస్టులను నియమించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. గురుకులాలు జైలు కన్నా దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతులు అందడం లేదన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మృతుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. గురుకులాల ఉద్యోగులకు జీతాలు రాకపోవడం శోచనీయమన్నారు. సీఎం ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంవీఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, విజయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.