- ప్రైవేట్ వెహికల్స్ పెరుగుతున్నా ఆర్టీసీకి ఆదరణ తగ్గట్లే: ఎండీ
- ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ పాటను రిలీజ్ చేసిన చైర్మన్, సజ్జనార్
- 24న 50కి పైగా సూపర్ లగ్జరీ బస్సులు ఓపెనింగ్
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీతో పబ్లిక్ కు ఎంతో అనుబంధం ఉందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. త్వరలో వెయ్యి కొత్త బస్సులు తెస్తామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సేవలు, ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల పాడిన ‘తెలంగాణ ఆన్ ట్రాక్ ’ పాటను బుధవారం ఎంజీబీఎస్ లో రామ్ తో కలిసి బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ విడుదల చేశారు. అనంతరం పాట ను భారీ ఎల్ఈడీ స్ర్కీన్ పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. ఈనెల 24న ట్యాంక్ బండ్ పై 50కిపైగా సూపర్ లగ్జరీ బస్సులను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లే, ఉద్యోగుల హెల్త్, సంక్షేమానికి సైతం అంతే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొన్ని కోట్ల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకోవడం సంతోషకరమని ఎండీ సజ్జనార్ అన్నారు. తాను కర్ణాటకలో కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో చాలా కాలం ప్రయాణించానన్నారు. ప్రైవేట్ వెహికిల్స్ పెరుగుతున్నా ఆర్టీసీకి ఆదరణ తగ్గడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను పాట రూపంలో చెప్పడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలందరితో ఆర్టీసీకి ఉన్న అనుబంధమే ఈ పాట అని సింగర్ రామ్ మిరియాల పేర్కొన్నారు. పాట పాడే అవకాశం తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ఎంతో కాలంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఉత్తమ ప్రయాణికులను ఈ సందర్భంగా చైర్మన్, ఎండీ సన్మానించారు.
బస్సుల తయారీని పరిశీలించిన ఎండీ
కర్ణాటక బెళగావిలోని ఎంజీ ఆటోమోటివ్స్ (బస్ అండ్ కోచ్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తయారవుతున్న బస్సుల నిర్మాణాన్ని ఎండీ సజ్జనార్ పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ లగ్జరీ బస్సులను ఆయన తనిఖీ చేశారు. ఎంజీ ఆటో మోటివ్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శివకుమార్, ఫ్లాంట్ హెడ్ రాజేంద్రతో చర్చించి పలు సూచనలు చేశారు. బస్సులను త్వరితగతిన రెడీ చేసి అందించాలని కోరారు. అశోక్ లేలాండ్ అధీకృత బాడీ నిర్మాణ సంస్థ అయిన ఎంజీ ఆటోమోటివ్స్ 630 సూపర్ లగ్జరీ బస్సుల నిర్మాణానికి టెండరు దక్కించుకుంది.