మూడేళ్ల తర్వాత ఆర్టీసీలోని సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందన్నారు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు వేతన సవరణ చేసింది కానీ..ఆర్టీసీ ఉద్యోగులకు రెండు సార్లు వేతన సవరణ చేయలేదని చెప్పారు. ప్రైవేట్ బస్సులు పెరిగిపోతుండటంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ డిపోల మూసివేతను నిలిపివేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని కోరారు.
అన్ని కార్మికుల కార్మికుల సమస్యలను చైర్మన్, ఎండి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా..వారిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. కార్మికులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఉద్యోగ కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్ కార్యాచరణ చేపడుతామని చెప్పారు.
కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆర్టీసీ జేఏసీ.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతుందా? లేదా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.