- ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను సకాలంలో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. అప్పుడే బ్యాంకు లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని చెప్పారు. సోమవారం బస్ భవన్ లో బ్యాంక్ కేవైసీ అప్డేట్ పై ప్రజా అవగాహన ప్రచార పోస్టర్ ను నాగిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ అధికారులు మాట్లాడుతూ.. ఆన్ లైన్, ఏటీఎం, బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ లేదా బ్యాంకు శాఖ ద్వారా కేవైసీ అప్డేట్చే సుకోవచ్చన్నారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లు సమర్పించవచ్చని తెలిపారు.
"కేవైసీ– సురక్షిత బ్యాంకింగ్ కు మీ తొలి అడుగు" అనే నినాదంతో ఈ నెల 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కేవైసీ, సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే ఖాతాల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం, కేవైసీకు సంబంధించిన మోసాలు, మనీ మ్యూల్ కార్యకలాపాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆర్బీఐ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అర్బీఐ జీఎం ముత్యాల జ్ఞాన సుప్రభాత్, ఏజీఎంలు యశ్వంత్ సాయి చిట్టెంశెట్టి, రాములు సభావత్ తదితరులు పాల్గొన్నారు.
