స్టూడెంట్గా ఉన్నప్పుడే.. లక్ష్యం పెట్టుకోవాలి
టెక్నాలజీలో నాలెడ్జ్ పెంచుకోవాలి: సజ్జనార్
హైదరాబాద్, వెలుగు : స్టూడెంట్ దశలోనే లక్ష్యాలు నిర్ధేశించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదని, దానికి నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, అంకితభావం అవసరమని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్ సుచిత్రలోని కమ్యూనిటీ హాల్ లో ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘సోమవంశ సహ సృజన క్షత్రియ పట్కార్ ప్రాంతీయ సమాజ్’ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి సజ్జనార్ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు.
స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ లో ఎడ్యుకేషన్ తో పాటు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సంఘటనలు తెలుసుకోవాలన్నారు. టెక్నాలజీలో నాలెడ్జ్ పెంచుకుంటూ, కొత్త కోర్సులు నేర్చుకుంటే మంచి భవిష్యత్ తో పాటు జాబ్స్ వస్తాయని సూచించారు. క్షత్రియ ప్రాంతీయ సమాజ్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్, ఆర్టీసీ సీవోవో రవీందర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువకులు సమాజ్ కల్చర్ ను అనుసరించాలని మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం సూచించారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ సీనియర్ లీడర్ నాగురావు నామాజీతో పాటు క్షత్రియ సమాజ్ నేతలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్షత్రియ కమ్యూనిటీలోని ఉత్తమ విద్యార్థులను సన్మానించారు.