- ఎండీ నిర్ణయం.. అధికారులకు సర్క్యులర్..
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీలో ఆదాయం పెంపునకు అధికారులు, ఉద్యోగులు, కార్మికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సంస్థ ఎండీ నాగిరెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు డిపోలవారీగా ఉద్యోగులు, కార్మికులతో మేధో మథన సదస్సులు నిర్వహించి, తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అందుకు సంబంధించి బుధవారం ఆయన సర్క్యులర్ జారీ చేశారుఆర్టీసీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయిందని సర్క్యులర్లో ఎండీ తెలిపారు.
ఇప్పటికైనా ఆర్టీసీలో ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపుపై సరైన నిర్ణయం తీసుకోకపోతే సంస్థను నడపడం కష్టమని చెప్పారు. ఇందుకోసం ప్రతి డిపో మేనేజర్, రీజియనల్ మేనేజర్లు, ప్రతి విభాగం హెడ్ తమ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులతో మేధో మథన సమావేశాలు ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు, సూచనలను తనకు నివేదిక రూపంలో ఈ నెలాఖరులోపు పంపించాలని పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయాలు అమలు చేస్తామని ఎండీ వెల్లడించారు.
