- బస్భవన్లో సంస్థ ప్రతినిధుల సంప్రదింపులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ను ‘మెడికేర్’ సంస్థకు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు నాలుగైదు రోజుల నుంచి హాస్పిటల్లో పలు వివరాలు సేకరించిన ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం బస్ భవన్లో ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ సుమారు రెండు ఎకరాల పరిధిలో ఉంది. ఈ స్థలం ఉస్మానియా యూనివర్సిటీది కాగా గతంలో ఆర్టీసీకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆర్టీసీ.. ఓయూకు కొంత డబ్బులు కూడా చెల్లించింది. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం జరగలేదు. స్థలం ఓయూది కాబట్టి మెడికేర్ప్రతినిధులు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.
యథాతథంగా అప్పగిస్తరా?
ప్రస్తుతం తార్నాక హాస్పిటల్లో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తార్నాక హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి ఫెసిలిటీస్ కల్పిస్తామని ఇటీవల ఎండీ సజ్జనార్ కూడా ప్రకటించారు. అయితే హాస్పిటల్ను యథాతథంగా మెడికేర్సంస్థకు అప్పగిస్తారా? లేదా పూర్తిగా అమ్ముతారా? లీజ్కు ఇస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రైవేటు సంస్థకు హాస్పిటల్అప్పగిస్తే.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి సదుపాయాలు అందే అవకాశం ఉందనే దానిపై సందేహం వ్యక్తమవుతోంది.