
బషీర్బాగ్, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని పల్లె దవాఖాన వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు రవికుమార్, వెంకన్న ధరావత్, వీరేంద్రనాథ్ మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా తమను నియమించాయన్నారు.
రాష్ట్రంలో ఉన్న మూడు వేల పల్లె దవాఖానాల్లో నాలుగేండ్లుగా పనిచేస్తున్నామని, ఒక్కో డాక్టర్ ఐదు గ్రామ పంచాయితీల్లో సేవలు అందిస్తున్నాన్నారు. రోగులు, వారికి అందించిన సేవల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని చెప్పడంతో తమపై పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై అదనపు భారాన్ని తొలగించి తమ జీతాన్ని రూ. 65 వేలకు పెంచాలని కమిషనర్ను కోరారు.