ఖమ్మంలో అంతా ప్యాకేజీల మయం

ఖమ్మంలో అంతా ప్యాకేజీల మయం
  •     భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వారం రోజులుగా జోరుగా  వలసలు
  •     బీఆర్ఎస్​లో అలకలకూ స్పెషల్​ ప్యాకేజీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రాజకీయం అంతా ప్యాకేజీల మయంగా మారింది.  ప్యాకేజీ కన్ఫర్మ్​ కావడమే ఆలస్యం నాయకులు, కార్యకర్తలు ఆ గట్టు నుంచి ఈ గట్టుకు క్షణాల్లో జంప్​ అవుతున్నారు.  వారం రోజులుగా జిల్లాలో జంపింగ్​ల  సంఖ్య అన్ని పార్టీల్లోనూ జోరందుకుంది. 

మరో పది రోజులే.. 

అసెంబ్లీ ఎన్నికలు మరో పది రోజులే ఉండడంతో జిల్లాలోని ప్రధాన పార్టీల క్యాండిడేట్లు, ఆయా పార్టీల నేతలు జంప్​ జిలానీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా పార్టీల్లో అసంతృప్తితో రగులుతున్న నేతలతో పాటు చోటామోటా నాయకులు ఇదే అదునుగా భావించి ప్యాకేజీలు సెటిల్​ చేసుకుంటూ గోడ దూకుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్యాకేజీల జోరు కొనసాగుతోంది. 

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణకు బీఆర్​ఎస్​లో చేరితే మంచి భవిష్యత్​ ఉంటుందంటూ ఆశ చూపి పార్టీలోకి చేర్చుకున్నారు. చేరి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. పినపాక నియోజకవర్గ ఇన్​చార్జిగా బాధ్యతలు ఇచ్చినా ఆయన మాత్రం కొత్తగూడెం నియోజకవర్గంలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. ఇందులో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. 

కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ పార్టీలోని ఓ ముఖ్య నేత దాదాపు రూ. 2కోట్లకు బీఆర్​ఎస్​కు అమ్ముడు పోయారని ఆ రెండు పార్టీల్లోని కార్యకర్తల్లో చర్చించుకుంటున్నారు. రెండు రోజుల కిందట కమ్యూనిస్టు పార్టీకి చెందిన రామవరం, రుద్రంపూర్​ ఏరియాలకు చెందిన పలువురు ప్రజా సంఘాల నేతలను మంచి ప్యాకేజీలతో బీఆర్ఎస్​ నేతలు లాక్కున్నారనే ప్రచారం సాగుతోంది. అంతకుముందు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లలో ఒక్కొక్కరికీ రూ. 20 లక్షల ప్యాకేజీ ఆఫర్​తో బీఆర్ఎస్​ నేతలు చేర్చుకున్నారని సమాచారం. 

భద్రాచలంలో సీపీఐకి చెందిన ముఖ్య నేతతో ప్రధాన క్యాడర్, కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేతలు తాండ్ర రమణ, రమేశ్​గౌడ్​తో పాటు పలువురు భారీ ప్యాకేజీలతో బీఆర్​ఎస్​లో ఇటీవల జాయిన్​అయ్యారు. అశ్వారావుపేట నియోజవవర్గం నుంచి ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీలు ఇద్దరు భారీ ప్యాకేజీలతోనే బీఆర్ఎస్​లో చేరారని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు.

అలకలకూ ఓ ప్యాకేజీ.. 

బీఆర్ఎస్​తో పాటు కాంగ్రెస్​ పార్టీలలో అలకలకూ ఓ ప్యాకేజీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చే వారితో పాటు తమ పార్టీలో ఉన్న ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా బీఆర్​ఎస్​ నేతలు ప్యాకేజీలు ఇస్తుండడంతో ఆ పార్టీలోని మరికొందరు ప్రజాప్రతినిధులు తమ సంగతేంటి అంటూ అలకబూనారు. తాము కూడా పార్టీ మారుతామంటూ హైకమాండ్​కు ఆల్టిమేటం జారీ చేశారు. 

దీంతో అధికార పార్టీ నేతలు అలకబూనినవారితో చర్చలు జరిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24 మంది కౌన్సిలర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుసుకున్న ఆ పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరికీ రూ. 8లక్షల చొప్పున ప్యాకేజీ ఇచ్చి కాపాడుకున్నారనే ప్రచారం ఉంది. ఇదే విధంగా ఓ ముఖ్య నేత పార్టీ మారుతున్నారనే ప్రచారంతో భారీ ప్యాకేజ్​ ఇచ్చినట్టుగా ఆ పార్టీ కార్యకర్తలే పేర్కొంటుండడం గమనార్హం.