- ఉక్రెయిన్పై దాడి ఊహాగానాల మధ్య పుతిన్ ప్రకటన
- స్వయంగా డ్రిల్ చూడనున్న రష్యా ప్రెసిడెంట్
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ మరింత ముదురుతోంది. దాడి చేయబోమని రష్యా, చేసి తీరుతుందని అమెరికా కరాఖండిగా చెప్తున్న టైంలోనే.. రష్యా సంచలన ప్రకటన చేసింది. శనివారం న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తామని ప్రకటించింది. డ్రిల్స్లో భాగంగా వేరే ఖండాల మీద దాడి చేసేందుకు వీలుగా తయారు చేసి పెట్టుకున్న ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిటిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ను టెస్ట్ చేస్తామని రష్యా రక్షణ శాఖ శుక్రవారం ప్రకటన చేసింది. ఈ డ్రిల్స్ను ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా దగ్గరుండి చూస్తారని వెల్లడించింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై రష్యా రక్షణ శాఖ అధికారులతో పుతిన్ సమావేశమయ్యారు.
పుతిన్ లాంచ్ ప్రాక్టీస్
డిఫెన్స్ మినిస్ట్రీ సిచువేషన్ రూం నుంచి మిసైల్స్ లాంచ్ను పుతిన్ పరిశీలిస్తారని, ఆయన కూడా మిసైల్ లాంచింగ్ను ప్రాక్టీస్ చేస్తారని రక్షణ శాఖ అధికారి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. డ్రిల్స్ చేస్తున్నట్టు చాన్నాళ్ల క్రితమే ఇన్ఫార్మ్ చేశామని, వెస్టర్న్ కంట్రీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బాలిస్టిక్ మిసైల్స్ ప్రాక్టీస్ లాంచ్ ఎప్పుడూ జరిగేదేనని పేర్కొన్నారు. ‘బ్లాక్ సీ ఫ్లీట్(నల్ల సముద్రంలో మోహరించిన సైన్యం)’ కేంద్రంగా ఈ న్యూక్లియర్ డ్రిల్స్ జరగనున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నౌకలు, సబ్మెరీన్లను కాలిబర్ క్రూయిజ్ మిసైల్స్తో పవర్ఫుల్గా తయారు చేశారు. ప్రస్తుతం వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ లేవని అధికారులు చెప్తున్నారు. బ్లాక్ సీ ఫ్లీట్తో పాటు స్ట్రాటజిక్ మిసైల్ఫోర్సెస్, రష్యా ఎయిర్ఫోర్స్, నార్తర్న్ ఫ్లీట్ కూడా డ్రిల్స్లో పాల్గొంటాయని అంటున్నారు. కాగా, రష్యాకు దీటుగా ఉక్రెయిన్ కూడా యాంటీ ట్యాంక్ డ్రిల్స్ను నిర్వహించింది.
రష్యా దాడి చేస్తుంది: బైడెన్
అమెరికా డిప్లొమాట్ను రష్యా బహిష్కరించిందని, దీంతో ఉక్రెయిన్పై ఆ దేశం దాడి చేసే ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. రెచ్చగొట్టేవిధంగా దాడులకు పాల్పడితే దానికి తగ్గట్టు బదులు చెప్తామని వార్నింగ్ ఇచ్చారు. వెస్టర్న్ కంట్రీస్ లీడర్లతో బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఉక్రెయిన్ మీద దాడి చేయబోమంటూ రష్యా ప్రకటించాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సవాల్ చేశారు. ఆ విషయాన్ని సూటిగా.. స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. బలగాలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలను వెనక్కు తీసుకెళ్లి ప్రపంచానికి చూపించాలన్నారు.
ఇండియన్లను తీసుకొచ్చేందుకు మూడు ఫ్లైట్లు: ఎయిర్ ఇండియా
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్లు, స్టూడెంట్లను తీసుకొచ్చేందుకు 3 విమానాలను నడుపుతున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో ఉక్రెయిన్లోని బోరిస్పిల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లు నడుస్తాయని వెల్లడించింది. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసులు, వెబ్సైట్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది.