రష్యా ప్రధానికి కరోనా

రష్యా ప్రధానికి కరోనా
  • దేశంలో లక్ష దాటిని పాజిటివ్‌ కేసులు
  • తాత్కలిక ప్రధానిని నియమించిన పుతిన్

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాను గడగడలాడిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ దేశ ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌కి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన గురువారం హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. “ కరోనా పాజిటివ్‌ వచ్చినందున తోటి వారిని సంరక్షించేందుకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్తున్నాను. టెంపరరీ యాక్టింగ్ పీఎంను నియమించాలని కోరుతున్నాను” అని రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌‌ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్‌ ఆండ్రీ బెలోసోవ్‌ను యాక్టింగ్‌ ప్రైమ్‌మినిస్టర్‌‌గా నియమించారు. కరోనా వైరస్‌ ఎవరికైనా సోకొచ్చని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పుతిన్‌ అన్నారు. మిఖాయిల్‌ త్వరలోనే కోలుకుంటారని ఆశించారు. పుతిన్‌ చాలా రోజుల నుంచి అందరితో వీడియో కాన్ఫరెన్స్‌లోనే మాట్లాడుతున్నారని, ప్రధానిని కూడా చివరి సారి మార్చి 24న కలిశారని అధికారులు చెప్పారు.
రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
రష్యాలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 7,099 కేసులు పాజిటివ్‌ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. దాదాపు 85 రీజన్లలో కరోనా ప్రభావం ఉందని, అన్ని ప్రాంతాల కంటే మాస్కోలో మరి ఎక్కువగా ఉంది. కాగా మరణాల రేటు మాత్రం తక్కువగా ఉందని అధికారులు చెప్పారు. మెరుగైన ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం, కావాల్సిన హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం వల్ల చనిపోయిన వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నారు.