లా ప్లాగ్నే: ఫ్రాన్స్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘6వ లా ప్లాగ్నే ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఇండియా గ్రాండ్ మాస్టర్ పి. ఇనియన్ గెలుచుకున్నాడు. మాస్టర్స్ కేటగిరీలో ఒక్క మ్యాచ్లోనూ ఓడకపోవడం విశేషం. తొమ్మిది రౌండ్ల పాటు సాగిన ఈ పోటీల్లో ఇనియన్ 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం ఆరు విజయాలు, మూడు డ్రాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు.
మొదటి రౌండ్లో ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో పాయింట్ సాధించిన ఇనియన్, రెండో రౌండ్ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో ఊపుందుకున్నాడు. ఐదో రౌండ్ డ్రా అయినప్పటికీ, తర్వాతి మూడు రౌండ్లలో వరుస విజయాలు నమోదు చేసి టైటిల్ వైపు దూసుకెళ్లాడు.
ఈ క్రమంలో ఇటలీకి చెందిన జీఎం లూకా మొరోని, ఉక్రెయిన్కు చెందిన ఐఎం డానియల్ మోసెసోవ్లపై సాధించిన కీలక విజయాలు ఇనియన్ చాంపియన్గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాయి. మోసెసోవ్ రన్నరప్గా నిలవగా, లూకా మొరోని మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అరోణ్యక్ ఘోష్, దిప్తాయన్ ఘోష్ చెరో 6.5 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానాన్ని పంచుకున్నారు. ఇనియన్కు ఈ ఏడాది (2026) ఇది నాలుగో టోర్నమెంట్ టైటిల్ కాగా, క్లాసికల్ చెస్ విభాగంలో రెండోది కావడం విశేషం.
