హైదరాబాద్, వెలుగు: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి కొత్త సవాళ్లను తెచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా మూడో వేవ్ సాగుతున్నప్పటికీ, ఎకానమీ రికవరవుతున్న టైములో వచ్చిన ఈ యుద్ధం పెద్ద దెబ్బే తీసిందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆహార సంక్షోభంలోకి నెట్టేసిందని చెప్పారు. హైదరాబాద్లో శనివారం జరిగిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఆర్బీఐ) యాన్యువల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్లో శక్తికాంత దాస్ పాల్గొన్నారు. కరోనా సంక్షోభం వల్ల బిగ్ డేటా పవర్ తెలుసుకోవడం వీలయిందని, అలాగే వర్క్ ఫ్రం హోమ్ ఎలా ఉంటుందో తెలిసిందని దాస్ అన్నారు. కొవిడ్–19 క్రైసిస్ ఎన్నో కొత్త అంశాలపై రీసెర్చ్కి దారితీసిందని, డిమాండ్–సప్లయ్ షాక్స్, పాలసీ స్టిమ్యులస్ ఎలా ఉండాలనే వాటిపై రీసెర్చ్ అవసరమైందని ఆయన పేర్కొన్నారు.
కీలకమైన సప్లయ్ల కోసం ఒక్కరి మీదనే ఆధారపడకూడదనే విషయాన్ని రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అనుభవంలోకి తెచ్చిందని చెప్పారు. ఒక్కరి కంటే ఎక్కువ సప్లయర్స్నే అట్టి పెట్టుకోవాలని అర్ధమైందన్నారు. కమొడిటీల రేట్లు చుక్కలంటాయని, సప్లయ్ చెయిన్లు సవాళ్లు తెచ్చాయని దాస్ చెప్పారు. ఫలితంగా గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగిందని, పాలసీ మేకర్లకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మార్చి 2020 తర్వాత ఎకనమిక్ రీసెర్చర్లకు మూడు సవాళ్లు వచ్చాయని, ఒకటి కొవిడ్ –19 అయితే, రెండోది రష్యా–ఉక్రెయిన్ యుద్ధమని, ఇక మూడో సవాలు చాలా దేశాలు తమ మానిటరీ పాలసీలను టైట్ చేయడమని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఈ మూడు షాక్ల ఎఫెక్ట్లు ఇంకా కనబడుతూనే ఉన్నాయని, జాగ్రత్తగానే గమనించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ రీసెర్చ్ డిపార్ట్మెంట్ చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందన్నారు.