
- ఏపీలో రైతు బంధు తరహా స్కీం
- ఆ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం
అమరావతి: ఏపీలో రైతు బంధు తరహా పథకం అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవ్యాంధ్రలోని రైతులందరికీ ఏ షరతులూ లేకుండా రూ.10 వేలు సాయం అందించాలని నిర్ణయించింది. ఇటీవలే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీముకు రూ.7,621 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో దీని అమలుకు ఆమోదం తెలిపారు. దీనితో పాటు రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయించారు.
పథకం అమలు ఇలా..
- ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఈ మొత్తం అందిస్తారు. ఖరీఫ్లో, రబీలో 2 దశలుగా ఒక్కో సీజనుకు రూ.5వేల చొప్పున ఇస్తారు.
- కౌలు రైతులకు కూడా ఖరీఫ్ నుంచి ఈ సాయం అందించేలా మార్గదర్శకాలు.
- రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. 5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది రైతులు ఉన్నారు.
- ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ.
- కుటుంబానికి రూ.10వేలు చొప్పున ఇవ్వడం ద్వారా రైతులకు మొత్తం రూ.7,621 కోట్ల లబ్ది కలుగుతుంది.
- ‘కేంద్రం తన పథకంపై అనేక ఆంక్షలు పెట్టింది, 5ఎకరాల లోపు వారే అని కేంద్రం పేర్కొంది. పైగా 3 వాయిదాలలో ఇస్తోంది. కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసింది. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించింది’ అని మంత్రిమండలిలో తీర్మానం చేశారు.