రైతు బీమా కోసం భర్తను చంపిన భార్య

రైతు బీమా కోసం భర్తను చంపిన భార్య

మెదక్/కౌడిపల్లి, వెలుగు: రైతు బీమా డబ్బుల కోసం భర్తను హత్య చేసిన భార్య, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తూప్రాన్​ డీఎస్పీ యాదగిరి రెడ్డి మంగళవారం కౌడిపల్లి పోలీస్​ స్టేషన్​లో కేసు వివరాలు వెల్లడించారు. మెదక్​జిల్లా కౌడిపల్లి మండలం పీర్ల తండా గ్రామ పంచాయతీ కొయ్యగుండు తండాకు చెందిన కాట్రోత్ శ్రీను, దేవి భార్యాభర్తలు. ఈ నెల 18న శ్రీను పొలం వద్ద శవమై కనిపించాడు. పోలీసుల దర్యాప్తులో భార్య దేవి, మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం శ్రీనును హత్య చేసినట్టు తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఎల్ఐసీ, రైతు బీమా సొమ్ము పొందేందుకు భర్తను హత్య చేయాలని దేవి నిర్ణయించుకుంది. తనకు సహకరిస్తే రూ. 50 వేలు ఇస్తానని అదే తండాకు చెందిన పవన్ కుమార్ తో బేరం కుదుర్చుకుంది. 

ఫ్రెండ్ రాణితో కలిసి హత్యకు స్కెచ్​ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్​ ప్రకారం ఈ  నెల 18న శ్రీనును మద్యం తాగుదామంటూ పవన్ కుమార్ గ్రామ శివార్లలోకి తీసుకెళ్లాడు.  మద్యం తాగిన శ్రీను మత్తులోకి జారుకున్న అనంతరం దేవి నైలాన్ తాడును అతడి గొంతుకు చుట్టి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసి హత్య చేసింది. అనంతరం ముగ్గురు కలిసి డెడ్ బాడీని 600 మీటర్ల దూరం లాక్కెళ్లి పడేశారు. 19న ఉదయం పొలం వద్ద శ్రీను డెడ్​బాడీని తండావాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సెల్ ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులైన దేవి, పవన్ కుమార్, రాణిను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.