
లండన్: లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో.. ఇండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిత్ర పటాన్ని గురువారం (జులై 10) ఆవిష్కరించారు. ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్కు ముందు ఈ కార్యక్రమం జరిగింది. 18 ఏళ్ల కిందట సచిన్ ఇంట్లో తీసిన ఓ ఫొటోను స్టువర్ట్ పియర్సన్ రైట్ అద్భుతంగా క్యాన్వాస్పై చిత్రీకరించాడు. ఈ ఏడాది చివరివరకు ఈ చిత్రాన్ని ఎంసీసీ మ్యూజియంలో ఉంచనున్నారు.
తర్వాత పెవిలియన్కు మారుస్తారు. గతంలో పియర్సన్.. కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్సర్కార్ చిత్రాలను కూడా చిత్రించాడు. ‘ఇదో గొప్ప గౌరవం. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు లార్డ్స్తో నాకు తొలి పరిచయం ఏర్పడింది. కపిల్ దేవ్ ట్రోఫీ ఎత్తడం చూశా. ఆ క్షణం నా క్రికెట్ జర్నీలో ఓ స్పార్క్ను కలిగించింది. ఈ రోజు ఈ చిత్ర పటంతో నా కెరీర్ సంపూర్ణమైంది.
నా కెరీర్లోకి తొంగి చూసినప్పుడు నా ముఖంపై చిరు నవ్వు వస్తుంది. ఇది నిజంగా ప్రత్యేకమైంది’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. గతంలో మాదిరిగా పూర్తి నిడివితో కూడిన చిత్ర పటం కాకుండా ఈసారి కేవలం తల, భుజాలతోనే ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.