ముంబై: ఆటకు ఎప్పుడో గుడ్బై చెప్పేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్లేయర్గా మరోసారి ఫీల్డ్లోకి దిగబోతున్నాడు. అతి త్వరలోనే కాళ్లకు ప్యాడ్స్ కట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టనున్నాడు. . వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లీగ్’లో బరిలోకి దిగబోతున్న సచిన్.. తన బ్యాటింగ్తో మరోసారి అభిమానులను అలరించనున్నాడు. అంతేకాక మాజీ క్రికెటర్లు ఆడే ఈ సిరీస్లో ఇండియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మాస్టర్తోపాటు వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, అజిత్ అగార్కర్ ఈ సిరీస్లో ఇండియాకు ఆడనున్నారు. వీరితోపాటు బ్రియాన్ లారా, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్, దిల్షాన్ తదితరులు కూడా బరిలోకి దిగనున్నారు.
గురువారం జరిగిన ఈ సిరీస్ లాంచింగ్ కార్యక్రమంలో సచిన్ మాట్లాడాడు. ‘త్వరలో ప్రాక్టీస్ మొదలుపెడతా. నాతో పాటు మిగిలిన క్రికెటర్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్లేయర్గా స్టేడియంలో అడుగుపెడుతున్నానంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సిరీస్లో ఆడుతున్న మాజీ క్రికెటర్లంతా ఒకప్పుడు మా ప్రత్యర్థులే. అయితే ఇప్పుడు, అప్పుడూ ఆఫ్ ద ఫీల్డ్ మేమంతా మంచి స్నేహితులం. స్టాండ్స్లోని అభిమానులు సచిన్, సచిన్ అంటూ చేసి నినాదాలను చివరి శ్వాస దాకా మరచిపోలేను. మరోసారి ఆ చప్పుడు వినేందుకు ఇదో అవకాశం’ అని అన్నాడు.
సౌరవ్ అదే ప్యాషన్ చూపిస్తాడు..
ప్యాషన్, ఫోకస్తో క్రికెటర్గా సౌరవ్ గంగూలీ ఏవిధంగా సక్సెస్ అయ్యాడో బీసీసీఐ ప్రెసిడెంట్గా కూడా మంచి పేరు తెచ్చుకుంటాడని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అతను క్రికెట్ ఆడిన విధానం, దేశానికి చేసిన సేవ వంటివి చూస్తే.. బీసీసీఐ ప్రెసిడెంట్గా సక్సెస్ అవుతాడనడంలో డౌటే లేదు. తనలో ఉన్న సామర్థ్యం, పట్టుదల, కసిని కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని సచిన్ తెలిపాడు.