
వేములవాడ, వెలుగు: వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. శనివారం ఉదయమే రంగురంగుల పూలను తీసుకొచ్చి ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ప్రధాన కూడళ్లలో బతుకమ్మ పాటలతో సందడి చేసి, అనంతరం వేములవాడ మూలవాగు వద్దకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలివచ్చారు. అక్కడ బతుకమ్మ పాటలతో, దాండియా కోలాటాలతో మహిళలు సందడి చేశారు. అనంతరం నిమజ్జనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తే వేములవాడలో ఏడో రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సప్తమాత్రుకల సంప్రదాయ ప్రకారం అమ్మవారిని ఏడు రూపాల్లో కొలుస్తారు.
బ్రాహ్వి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, శాముండ అమ్మవారి పేర్ల ఆధారంగా వేద పండింతుల సూచన మేరకు సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బి.గీతే, అడిషనల్ఎస్పీ శేషాద్రిని రెడ్డి, మున్సిపల్కమిషనర్అన్వేశ్, ఏఎంసీ చైర్మన్రొండి రాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ , కాంగ్రెస్ లీడర్లు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమురయ్య, స్వామియాదవ్, రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి/మానకొండూర్: కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ (బావుపేట), ఖాజీపూర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. మహిళలు, యువతులు కొత్త బట్టలు ధరించి బతుకమ్మలను రంగురంగుల పూలతో పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడారు.
అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత- మహేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్, రాఘవాపూర్, తోటకుంటపల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మను ఘనంగా
జరుపుకున్నారు.