‘మా అమ్మ ఎప్పటికీ నాతోనే ఉండాలి.. అందుకే నా పేరులో మా అమ్మ పేరును కలిపి నా పేరును సాయి దుర్గ తేజ్గా మార్చుకున్నాను’ అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. మహిళా దినోత్సవం సందర్భంగా తను లీడ్ రోల్లో నటించిన ‘సత్య’ షార్ట్ ఫీచర్ ఫిల్మ్ను శుక్రవారం స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా తన పేరును మార్చుకున్నట్టు ప్రకటించాడు సాయి తేజ్. అలాగే తన తల్లి పేరు కలిసొచ్చేలా విజయ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ను స్టార్ట్ చేశాడు.
సాయి తేజ్ మాట్లాడుతూ ‘నా జీవితంలో ముగ్గురు గొప్ప మహిళలు ఉన్నారు. మా అమ్మమ్మ అంజనా దేవి గారు, మా అమ్మ విజయ దుర్గ , మా పిన్ని మాధవి. వీరే నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఇక ఈ సినిమా నా స్నేహితులు నవీన్, హర్షిత్ చేస్తున్నారని తెలియగానే, ఇంత గొప్ప సినిమాలో నేను భాగమవుతానని అడిగి జాయిన్ అయ్యాను. నవీన్ నాలో కొత్త యాంగిల్ను తీసుకొచ్చాడు. ఇప్పటివరకు దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది.
చాలా అవార్డులు కూడా వచ్చాయి’ అని చెప్పాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘సొసైటీకి తన వంతుగా ఏమైనా చేయాలని నిత్యం తపన పడతాడు సాయిధరమ్ తేజ్. ఆయనతో పాటు ఈ సినిమా టీమ్ అంతా సమాజానికి తమ వంతు ఏమైనా చేయాలని చేసిన సినిమా ఇది. తప్పకుండా మా అందరి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు. సాయి తేజ్, స్వాతి జంటగా నవీన్ విజయకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్, హన్షిత నిర్మించారు.