సయామీ ఖేర్ తెలుగమ్మాయి కాదు. కానీ తెలుగు సినిమా ‘రేయ్’తో కెరీర్ స్టార్ట్ చేసింది. వెంటనే బాలీవుడ్ మూవీ ‘మీర్జయా’లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా రావలసినన్ని అవకాశాలు కానీ, చెప్పుకోదగ్గ పేరు కానీ రాలేదు. అయితే ఇన్నాళ్లకు తన కెరీర్ స్పీడందుకుందని హ్యాపీగా చెబుతోంది సయామీ. బాలీవుడ్లోని బెస్ట్ డైరెక్టర్స్లో ఒకరైన అనురాగ్ కశ్యప్తో కలిసి వర్క్ చేసే చాన్స్ దొరకడమే ఈ సంతోషానికి కారణం.
ఆమధ్య నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ మూవీలో నటించిన సయామీ.. రీసెంట్గా ఆనంద్ దేవరకొండ ‘హైవే’ చిత్రంలో పోలీసాఫీసర్గా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ప్రతీక్ గాంధీతో కలిసి ‘అగ్ని’, ఆర్.బాల్కి డైరెక్షన్లో ‘ఘూమర్’ చిత్రాలతో పాటు, సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘బ్రీత్’ మూడో సీజన్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇంతలోనే అనురాగ్ సినిమా బ్యాగ్లో పడటంతో చాలా ఎక్సయిటవుతోంది. ‘ఇంత మంచి ప్రాజెక్ట్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ వివరాలైతే చెప్పలేను కానీ ఈ మూవీతో ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తానని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను’ అంటోంది సయామీ. గుల్షన్ దేవయ్యా మరో లీడ్ రోల్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్కి వెళ్లనుంది.