- వదంతులు నమ్మవద్దన్న అధికారులు
- ప్రమాద స్థలం పరిశీలన
- గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఓల్డ్ సిటీ, వెలుగు : శాలిబండలోని గోమాతి ఎలక్ట్రానిక్ షాపులో సోమవారం రాత్రి మంటల ఘటనకు కారణం షాపులో షార్ట్సర్క్యూటే కారణమని తేల్చారు. ఘటన జరిగిన తర్వాత రకరకాల వదంతులు వ్యాప్తిలోకి వస్తుండడంతో పోలీసులు, ఫోరెన్సిక్, ఫైర్ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సౌత్జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఫోరెన్సిక్ ఆఫీసర్లువెంకన్న, ఇక్బాల్, ఫైర్ఆఫీసర్లు శ్రీధర్, సురేందర్రెడ్డి పరిశీలించారు.
ప్రమాదం జరిగిన షాపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు స్థానికులు షాపును కారు ఢీకొట్టిందని, మరికొందరు షాపు లోపల పేలుళ్లు జరిగాయని ప్రచారం చేస్తుండడాన్ని తప్పు పట్టారు. గోమాతి ఎలక్ట్రానిక్షాపులో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాక అవి రిఫ్రిజిరేటర్లు, ఏసీలోని సిలిండర్లు పేలడానికి కారణమైందని, ఆ తీవ్రత షాపు ఎదురుగా కొన్ని మీటర్ల వరకు వ్యాపించిందని చెప్పారు. దీని వల్లే నష్ట తీవ్రత పెరిగిందన్నారు. మంటలు షాపు ముందు నుంచి వెళ్తున్న కారుకు కూడా వ్యాపించి అది కాలిపోయిందన్నారు. ఈ కారు సీఎన్జీది అయినా, అదృష్టవశాత్తు సిలిండర్పేలకపోవడంతో పెను ముప్పు తప్పిందన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
రెండు ఫ్లోర్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఆహుతి
షాపులోని రెండు ఫ్లోర్లలోని ఎలక్ట్రానిక్వస్తువులు అన్నికాలి బూడిదయ్యాయి. షాపు వెనుక గల్లీలో బయటి వ్యక్తులు పార్క్ చేసిన ఒక ట్రాలీ ఆటో, స్కూటర్ కాలిపోయాయి. షోరూం పక్క ఇంటితో పాటు షాపు వెనుక ఉన్న రెండు షాపులకు స్వల్పంగా మంటలంటుకున్నాయి.
రోడ్డుపై ముందు వైపు ఉన్న బట్టల దుకాణంలోకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో షాపు బోర్డు కాలిపోయింది. ఈ విషయమై షోరూం పక్కన ఉండే ఇంటి ఓనర్ సులోచన మాట్లాడుతూ ‘రాత్రి పదిన్నర గంటలకు అనుకుంటా....పెద్ద పేలుడు సౌండ్ వినిపించింది. వెంటనే మంటలు వచ్చి మా వెంటిలేటర్ కాలిపోయింది. గోమాతి షాపు షట్టర్100 ఫీట్ల దూరంలో ఎగిరిపడింది. దీంతో బయటకు పరిగెత్తుకు వచ్చా’ అని చెప్పింది.
గాయపడ్డ వ్యక్తి మృతి..ఓనర్ పరిస్థితి విషమం
అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడగా, షోరూం బయట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 50 ఏండ్లకు పైపబడిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈయన ఉస్మానియాలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఇతడి ఆచూకీ ఇంకా లభించలేదు. షాపులో కౌంటర్ మీద కూర్చున్న ఓనర్ శివ బన్సీలాల్(53) 80 శాతం గాయాలతో సంతోష్నగర్ అపోలోలో చికిత్స పొందుతున్నాడు.
ఇదే షాపులో పని చేసే కార్మికులు గణేశ్, విజయ్, కార్తీక్లు 50 శాతం గాయాలతో మొగల్పురాలోని లూ హాస్పిటల్లో చేరారు. రోడ్డుపై ఆటో నడుపుకుంటూ వెళ్తున్న డైవర్ సయ్యద్ సాబీర్, వెనక కూర్చున్న మహ్మద్ గౌస్, రోడ్డుపై వెళ్తున్న ఊబర్ కారు డ్రైవర్ మణికంఠ స్వల్పంగా గాయపడ్డాడు.
షాపునకు నాలుగడుగుల దూరంలో రోడ్డుపై రన్నింగ్ లో ఉన్న ఊబర్ కారు మొత్తం కాలిపోగా, దీని డ్రైవర్, ఓనర్ మౌలాలికి చెందిన మోహన్ వెంటనే దిగి తప్పించుకున్నాడు. చికిత్స పొందుతున్న వారిని చార్మినార్ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ పరామర్మించారు.
