కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‎కు మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‎కు మరోసారి సీబీఐ నోటీసులు

చెన్నై: కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్‎కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2026, మార్చి 10న ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‎లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్‎ను సీబీఐ రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. 2026, జనవరి 12, 19వ తేదీన సీబీఐ ఎదుట విజయ్ విచారణకు హాజరయ్యారు. 

ఓ వైపు భార్యతో విడాకుల వివాదం, మరోవైపు నటి త్రిషతో ఎఫైర్ రూమర్ల నడుమ కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విజయ్‎ను మరోసారి విచారణకు పిలవడం హాట్ టాపిక్‎గా మారింది. ఈసారి సీబీఐ విజయ్‎ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమిళ పాలిటిక్స్‎లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. 

కరూర్ తొక్కిసలాట కేసు..!

తమిళనాడులోని కరూర్లో 2025, సెప్టెంబర్ 27న విజయ్ పార్టీ టీవీకే బహిరంగ సభ, రోడ్ షో జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఈ ర్యాలీ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటగంటకూ జనం రద్దీ పెరిగింది.

సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే  దాదాపు 30 వేల మంది జనం పోగయ్యారు. అయితే, మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండటంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్పై నిలబడి మాట్లాడుతుండగా.. ఆయనను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొందరు కిందపడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారి తీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కిందపడిపోయారు. జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్లు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. 

ఈ సందర్భంగా అంబులెన్స్లకు దారి ఇవ్వాలంటూ బస్​ పైనుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది. అలాగే తీవ్ర వేడితో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో విజయ్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కూడా కనిపించింది. ఇలా విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీ 41 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది.