![పది స్థానాలు కాంగ్రెస్, వామపక్ష కూటమివే: కూనంనేని సాంబశివరావు](https://static.v6velugu.com/uploads/2023/10/Sambasiva-Rao_pCazMxZ6vm.jpg)
పాల్వంచ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాలను కాంగ్రెస్, వామపక్ష కూటమే గెలుచుకుంటుదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం పాల్వంచలోని పార్టీ ఆఫీసులో జరిగిన జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీని, మాటల మాంత్రికుడు సీఎం కేసీఆర్ను ఇంటికి పంపే లక్ష్యంతో ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ను గద్దె దించే వరకు విశ్రమించేది లేదన్నారు.
అందుకే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నామన్నారు. కేసీఆర్కు ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హామీలను తుంగలో తొక్కి ప్రజలను సీఎం గోస పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టేందుకు నడుం బిగించామన్నారు.