డ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు: కలెక్టర్ క్రాంతి

డ్రోన్ శిక్షణతో ఉపాధి మార్గాలు: కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: పీఎం మోదీ మన్ కీ బాత్ లో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని కలెక్టర్ క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద 33 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా 28 మంది మహిళలు అర్హత సాధించారన్నారు. వారికి ఎయిర్ పోర్టు, కంపెనీలు, సర్వీస్ టాక్సీ,  ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళ అభివృద్ధి సంస్థను ఆదేశించారు.

 మహిళా సమాఖ్య సభ్యులు స్కూళ్లు తెరవక ముందే స్టూడెంట్స్​కు యూనిఫామ్స్​ అందించాలని, ఇందుకోసం కోసం క్లాత్ రెడీగా ఉందన్నారు. నమో దీదీ డ్రోన్ పథకం ద్వారా డ్రోన్ ట్రైనింగ్ పూర్తిచేసిన 52 మందికి మహిళ గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల సమయం, డబ్బు, నీరు, ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ జ్యోతి, అడిషనల్​డీఆర్డీఏ జంగారెడ్డి, ఎస్ హెచ్ జీ గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
 
జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై కలెక్టర్​క్రాంతి వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసే నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఆ లిస్టును బ్యాంకర్లకు పంపించాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితా త్వరగా అందించాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనాలని సూచించారు.