
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని గురుకులాల్లో గతేడాది ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఎంతోమంది పిల్లలు అస్వస్థతకు గురై ఇబ్బందిపడ్డారు. నాణ్యత లేని సరుకులు, వంట చేసేటప్పుడు శుభ్రత పాటించకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గురుకులాలు, కస్తూర్బాల్లో పనిచేస్తున్న వంట మనుషులు, పారిశుధ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆందోల్, కంది మండలం కాశీపూర్ కేజీబీవీల్లో ఇటీవల శిక్షణ ఇచ్చారు.
మెనూపై శిక్షణ
జిల్లా వ్యాప్తంగా 22 కేజీబీవీలు ఉండగా అందులో 5,500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఆహార తయారీలో శిక్షణ ఇఈప్పించేందుకు జిల్లా నుంచి ఇద్దరు వంట మనుషులు, ఒక టీచరు, ఇద్దరు పారిశుధ్య కార్మికులు, ఒక ఏఎన్ఎంను హైదరాబాద్ కు పంపించారు. అక్కడ శిక్షణ పొందిన వారు జిల్లా స్థాయిలో కేజీబీవీ, ఇతర గురుకులాలు, ప్రభుత్వ స్కూల్స్వంట మనుషులు, పారిశుధ్య సిబ్బందికి వారం కింద అవగాహన కల్పించారు. ఆహారంపై ఇచ్చిన శిక్షణకు 90 మంది, పారిశుధ్యంపై ఇచ్చిన శిక్షణలో 45 మంది పాల్గొన్నారు. ఈ శిక్షణలో మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం ఎలా తయారు చేయాలి, కూరగాయలు శుభ్రపరచే విధానం గురించి అవగాహన కల్పించారు.
కేజీబీవీల ఆధునీకరణకు రూ.1.48 కోట్లు
జిల్లాలో ఉన్న 17 కేజీబీవీల ఆధునీకరణకు రూ.1.48 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కొన్నేళ్లుగా కేజీబీవీల నిర్వహణ, కొత్త బిల్డింగులకు ఫండ్స్ లేక స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, పెయింటింగ్స్, మేజర్, మైనర్ వర్క్స్ తోపాటు ఇతరత్రా పనులకు ఆయా నిధులు ఖర్చు చేయనున్నారు. దీంతో కేజీబీవీల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కానున్నాయి.
గత సంవత్సరం జరిగిన కొన్ని సంఘటనలు..
ఫుడ్ పాయిజన్ వల్ల పటాన్చెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆ తర్వాత కోలుకున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బీబీపేట హైస్కూల్లో మిడ్ డే మిల్స్ లో ఎగ్ కర్రీ తిన్న పిల్లల్లో 14 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వారిని ఖేడ్ ఆస్పత్రికి తరలించగా ఒక్క రోజులో కోలుకున్నారు. నారాయణఖేడ్ పట్టణం జూకల్ శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉడికి ఉడకని మార్నింగ్ టిఫిన్ తిన్న కొందరు స్టూడెంట్స్ అస్వస్థకు గురయ్యారు. వారికి అక్కడే ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు.