రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు పారిశుధ్య కార్మికులపై దాడి...నలుగురు పశ్చిమ బెంగాల్ వాసుల అరెస్ట్

రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు  పారిశుధ్య కార్మికులపై దాడి...నలుగురు పశ్చిమ బెంగాల్ వాసుల అరెస్ట్
  • ముసారాంబాగ్​ ఎక్స్​ రోడ్​లో ఘటన 

మలక్ పేట, వెలుగు: డ్యూటీలో ఉన్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులపై దాడికి పాల్పడిన నలుగురు యువకులను మలక్ పేట పోలీసులు అరెస్ట్​చేశారు. బల్దియా కామాటిగా పని చేస్తున్న కత్తుల యాదయ్య, శానిటరీ ఫీల్డ్​అసిస్టెంట్​శ్రీనివాస్ కలిసి ముసారాంబాగ్ ఎక్స్ రోడ్​లో గురువారం ఉదయం చెత్త తీయడానికి వెళ్లారు. 

అదే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ చెందిన కొందరు యువకులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ అక్కడే ఉన్న హోటల్​లో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమంత్ భట్టాచార్య, సుమన దత్తా రోడ్డుపై చెత్త వేస్తుండడంతో చూసిన కత్తుల యాదయ్య రోడ్డుపై వేయవద్దని, డబ్బాలో వేయాలని చెప్పాడు. దీంతో వారు ఆగ్రహంతో యాదయ్యపై దాడి చేసి కొట్టారు. 

దాడిని ఆపేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఏ శ్రీనివాస్ పై కూడా అటాక్​చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన సోమంత్ భట్టాచార్య, సుమన్ దత్తాతో పాటు సహకరించిన శోభజిత్ షా..అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేశారు.