
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో పాక్ బ్యాట్స్మన్ సర్ఫరాజ్ అహ్మద్ అద్భుతంగా ఆడాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లలో మూడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. చివరి టెస్టులో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. 77 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో జట్టును ఆదుకున్నాడు. 176 బంతుల్లో 118 పరుగులు చేశాడు.
4 ఏళ్ల తర్వాత పాక్ జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ 8 ఏళ్ల తర్వాత సెంచరీ సాధించడంపై అభిమానులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సర్ఫరాజ్ సెంచరీ చేసిన సమయంలో అతని భార్య కన్నీటి పర్యంతమైంది.
ఎంతో కష్టపడి జట్టులో స్థానం దక్కించుకున్న సర్ఫరాజ్ అహ్మద్..వేల అభిమానుల మధ్య శతకం కొట్టడాన్ని లైవ్లో చూసిన అతని వైఫ్..ఆనంద బాష్పాలు రాల్చింది. తన హోంగ్రౌండ్లోనే ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరోవైపు పాక్, కివీస్ మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ డ్రా అయింది. తొలి టెస్టు డ్రాగా ముగియగా..రెండో టెస్టు కూడా డ్రా అయింది. రెండో టెస్టులో సర్ఫరాజ్ రాణించడంతో పాక్ గెలిచినంత పనిచేసింది. అయితే సర్ఫరాజ్ ఔటైన తర్వాత మిగతా ఆటగాళ్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు. చివర్లో మరో మూడు ఓవర్లు ఉన్నాయనగా బ్యాడ్ లైట్తో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ అహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.