Apsara Mystery : పూజారితో భక్తురాలు.. గుడి కేంద్రంగా లవ్ స్టోరీ..

Apsara Mystery : పూజారితో భక్తురాలు.. గుడి కేంద్రంగా లవ్ స్టోరీ..

సరూర్ నగర్ యువతి అప్సర మర్డర్ మిస్టరీ సంచలనంగా మారింది. వీళ్లిద్దరికీ అసలు పరిచయం ఎలా ఏర్పడింది.. ఎలా కలుసుకున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. భక్తురాలు అప్సర తల్లి, నిందితుడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ తండ్రి చెబుతున్న వివరాలు ప్రకారం.. అప్సర డెత్ మిస్టరీలోని లవ్ స్టోరీ ఇలా ఉంది. 

సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో  బంగారు మైసమ్మ కాశీ వైద్య నాథేశ్వర దేవాలయం ఉంది. ఈ గుడికి ఓ వైపు ఇంట్లో అప్సర కుటుంబం నివాసం ఉంటుంది. గుడికి మరో వైపు అపార్ట్ మెంట్ లో పూజారి సాయి కృష్ణ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అప్సరకు దైవ భక్తి ఎక్కువ కావటంతో.. ప్రతి రోజూ  అప్సర ఆలయానికి వస్తుంది. పూజలు ఉన్నప్పుడు వాలంటీర్ సేవలు కూడా చేస్తుంది. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అమ్మాయి కావటంతో.. ఆ ప్రాంతంలో అందరికీ పరిచయమే. ఇక పూజారి సాయి కృష్ణ సైతం ఆ కాలనీలో అందరికీ పరిచయం ఉన్న పూజారి. ఎంతో యాక్టివ్ గా సేవా కార్యక్రమాలు, నిత్య అన్నదానం చేస్తూ.. అందరి మన్ననలు పొందాడు. 

రోజూ గుడికి వచ్చే అప్సరతో పరిచయం ఏర్పడింది సాయి కృష్ణకు. అంతే కాకుండా అప్సర తల్లిని అక్కయ్య అంటూ మరింత దగ్గర అయ్యాడు. ఈ పరిచయం కాస్తా.. ఇద్దరి మద్య ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం రెండు కుటుంబాల్లో ఎవరికీ తెలియలేదు. అప్సర ఇంటికి తరచుగా సాయి కృష్ణ వస్తున్నా.. వాళ్లకు కూడా అనుమానం రాలేదు. ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లేవారని చుట్టుపక్కల వారు కూడా చెబుతున్నారు. 

వివాహేతర సంబంధాన్ని ఎన్నాళ్లో కొనసాగించలేమని భావించిన అప్సర.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. వాస్తవంగా అయితే అప్పటికే సాయి కృష్ణకు పెళ్లయ్యి.. నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. అలాంటి పూజారి సాయి కృష్ణతో ప్రేమ, వివాహేతర సంబంధం వరకు అప్సర రావటం విశేషం. సాయి కృష్ణకు పెళ్లయిన విషయం అప్సరకు ముందే తెలుసా లేదా అనేది ఇప్పటికి అయితే మిస్టరీగానే ఉంది. 

గుడిలో పూజారిగా ఎంతో పేరున్న సాయికృష్ణ.. అప్సరను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. అప్సర బతికి ఉంటే.. తమ ప్రేమ,  వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందో అని భయపడ్డాడు. దీంతో పక్కా ప్లాన్ గా అప్సరను హత్య చేసి.. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అప్సర వాళ్ల ఇంటికే వచ్చి.. భద్రాచలం వెళ్లినట్లు చెప్పాడు. ఆ తర్వాత తానే స్వయంగా పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే.. సాయి కృష్ణ – అప్సర మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.. అయినా కూడా పోలీస్ కంప్లయింట్ లో తన మేనకోడలు అని చెప్పటం చూస్తుంటే.. విచారణకు తప్పుదోవ పట్టించటానికే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏది ఏమైనా గుడి కేంద్రంగా మొదలైన ఓ ప్రేమ కథ.. ఆ తర్వాత వివాహేతర బంధానికి దారి తీయటానికి.. ఆ తర్వాత హత్య వరకు వెళ్లటం అనేది మాత్రం సంచలనంగా మారింది.