సర్పంచ్ ​ఆత్మహత్య : కట్టించిన శ్మశానవాటికలో.. ఆయనదే తొలి దహన సంస్కారం

 సర్పంచ్ ​ఆత్మహత్య : కట్టించిన శ్మశానవాటికలో.. ఆయనదే తొలి దహన సంస్కారం

పరకాల, వెలుగు : ఓ గ్రామ సర్పంచ్ గా కొత్తగా కట్టించిన శ్మశాన వాటిక ఆయన దహన సంస్కారలతోనే మొదలైంది. ఈ దురదృష్టకరమైన ఘటన హన్మకొండ జిల్లా పరకాల మండలంలో చోటుచేసుకుంది.  హైబోత్​పల్లిలో అప్పుల పాలై కుటుంబ కలహాలు ఏర్పడి.. భార్య పుట్టింటికి వెళ్లడంతో కలత చెందిన ఓ సర్పంచ్​ ఉరి వేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..కొద్ది రోజుల కింద సర్పంచ్​ కంచ కుమారస్వామి (35)కి ఆయన భార్యకు గొడవ జరగడంతో  పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల కింద అత్తగారింటికి వెళ్లి కాపురానికి రావాలని అడగ్గా ఆమె అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం చేనువద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. తర్వాత తన పెద్ద కొడుక్కి సమాచారం ఇచ్చాడు. మృతుడి తల్లి, కుటుంబసభ్యులు అక్కడకు వచ్చి పరకాల దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.

కాగా, సర్పంచ్​ ఆత్మహత్యకు మరికొన్ని కారణాలున్నాయని గ్రామస్తులంటున్నారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా వెంకటాపురం శివారు గ్రామం హైబోత్​పల్లి ఏర్పడడంతో గ్రామస్తులు కుమారస్వామిని ఏకగ్రీవంగా సర్పంచ్​గా ఎన్నుకున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కోసం కష్టపడ్డాడు. వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.24 లక్షల వరకు అప్పు చేశాడని సమాచారం. డంప్​ ​యార్డు, శ్మశానవాటిక పనుల కోసం డబ్బులు పెట్టుకోగా, ఆ బిల్లులు రాలేదని అందుకే అప్పుల పాలయ్యాడని గ్రామస్తులంటున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అతడి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.