ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
  • 22లోగా ‘పోడు’ లిస్టు రెడీ చేయాలి
  • కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్   

హుజూర్ నగర్, వెలుగు: డివిజన్ పరిధిలో పోడు భూముల కోసం అప్లై చేసుకున్న లబ్ధిదారుల లిస్ట్​ను ఫైనల్ ​చెయ్యాలని కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్  అధికారులను ఆదేశించారు. శనివారం హుజూర్​నగర్ ​ఆర్డీవో ఆఫీస్ లో ఫారెస్ట్​, రెవెన్యూ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులకు పోడు భూముల హక్కు  పట్టాలు పంచేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను స్పీడప్​ చేసి  ఈ నెల 22 లోగా ఫైనల్​ లిస్ట్​ను జిల్లా కమిటీ పంపాలని ఆదేశించారు. సాగులో ఉన్న భూమి, లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని  కలెక్టర్​సూచించారు.

ఈ నెల 26 లోగా ఓటరు నమోదు  పూర్తి చేయాలి

ఈ నెల 26 లోగా  ఓటరు నమోదు , సవరణలు పూర్తి చేసి తర్వాత అప్రూవ్ చేయాలని కలెక్టర్​అధికారులను ఆదేశించారు. ఓటర్ల నమోదుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లా ట్రైబల్ వెల్ఫేర్​ఆఫీసర్  శంకర్ నాయక్, ఫారెస్ట్ ఆఫీసర్ సతీశ్ కుమార్,  డివిజన్ రేంజ్ ఆఫీసర్  మహేశ్ గౌడ్ , హఫీజ్ ఖాన్ , హుజూర్ నగర్ ఆర్డీవో కె. వెంకారెడ్డి, తహసీల్దార్లు సచిన్ చందర్ తివారీ, శ్రీదేవి  తదితరులు పాల్గొన్నారు. 

పోడు భూములను పరిశీలించిన అడిషనల్​ కలెక్టర్​

దేవరకొండ (నేరెడుగొమ్ము), వెలుగు: నేరెడుగొమ్ము  మండలం.. కాసరాజ్​పల్లి, బుగ్గతండాల్లోని పోడు భూములను శనివారం అడిషనల్​కలెక్టర్​భాస్కర్​రావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు తమకు 2006లో అప్పటి ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చిందని అడిషనల్​కలెక్టర్​భాస్కర్​రావు కు చెప్పారు. కాసరాజ్​పల్లి, బుగ్గతండాలకు చెందిన 76 మంది రైతులకు 400 ఎకరాల వరకు పట్టాలు ఇచ్చారన్నారు. ఆ భూముల్లో ఫారెస్ట్​  ఆఫీసర్లు రైతులను భయపెడుతున్నారని, దౌర్జన్యంగా మొక్కలను నాటారని కంప్లైంట్​చేశారు. ఈ సందర్భంగా భాస్కర్​రావు మాట్లాడుతూ ‘పోడు’  పట్టాలు కలిగి ఉండి కబ్జాలో ఉన్న రైతులకు ఎలాంటి అన్యాయం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. డీటీడీవో రాజ్​కుమార్, ఆర్డీవో గోపీరాం, ఎఫ్డీవో సర్వేశ్వర్​రావు, ఎఫ్​ఆర్వో సాయిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. 

కబ్జాలను.. పట్టించుకుంటలేరు ఆఫీసర్లపై కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు

హుజూర్ నగర్, వెలుగు:మున్సిపాలిటీలో లే అవుట్​స్థలాలు కబ్జా అవుతున్నా.. ఆఫీసర్లు పట్టించుకుంట లేరని  కౌన్సిలర్లు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ స్థలాలు కాపాడాలని  శనివారం హుజూర్​నగర్​డివిజన్ ఆఫీస్​లో కలెక్టర్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  కౌన్సిలర్లు జక్కుల వీరయ్య, కోతి సంపత్ రెడ్డి .. హుజూర్​నగర్​మున్సిపాలిటీలో 70 వేల గజాల లే అవుట్ స్థలం ఉన్నదని, ఆ స్థలాన్ని కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారని కలెక్టర్​కు వివరించారు. వీపీఆర్​వెంచర్ లో  రూ. 3 కోట్ల విలువ చేసే 3 వేల  గజాల స్థలాల్లో  మున్సిపల్​ బోర్డులను తొలగించి  అమ్మేయాలని చూస్తున్నారని కలెక్టర్​కు చెప్పారు.  సంబంధించిన డాక్యుమెంట్లు  మున్సిపల్ ఆఫీస్​ నుంచి  మాయం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. వాటిని స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని  కోరారు. ఆక్రమణలపై రీజనల్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్లకు,  మున్సిపల్ కమిషనర్​కు ఎన్ని సార్లు  కంప్లైంట్​చేసినా పట్టించుకుంటలేరని ఫిర్యాదు చేశారు. 

‘ఇన్నోవేషన్’ చేసేలా స్టూడెంట్లను ప్రోత్సహించాలి

యాదాద్రి, వెలుగు: ఆవిష్కరణలు చేసేందుకు స్టూడెంట్లను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ‘స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–- 2022’  పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. స్కూల్​స్టేజీ నుంచే స్టూడెంట్లలో  కొత్త ఆవిష్కరణలు  చేసేలా  టీచర్లు ప్రోత్సహించాలని సూచించారు. స్టూడెంట్లలో డిజైన్ థింకింగ్ ను పెంపొందించేందుకు రాష్ట్ర సాంకేతిక శాఖ,  స్టేట్ ఇన్నోవేషన్ సెల్,  యునిసెఫ్ ఇండియా, ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా చాలెంజ్​ ప్రోగ్రాం ప్రారంభించాయన్నారు. జిల్లాలోని  168 స్కూళ్లు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఆవిష్కరణ రంగంలో జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. డీఈవో కె. నారాయణ రెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్​ ఆండాలు, జిల్లా సైన్స్ ఆఫీసర్​భరణి కుమార్, జిల్లా సైన్స్ కాంగ్రెస్ అకడమిక్ కో ఆర్డినేటర్ నర్సింహ్మా చారి, సబ్జెక్ట్ ఫోరమ్ ప్రతినిధులు రాజశేఖర్, బుస్స రమేశ్, నరేంద్ర స్వామి తదితరులు  పాల్గొన్నారు. 

పెండింగ్​ బిల్లులు వెంటనే చెల్లించాలి
ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట  సర్పంచ్​ల ధర్నా

దేవరకొండ, వెలుగు: పెండింగ్​ బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ శనివారం దేవరకొండ ఎంపీడీవో ఆఫీస్​ఎదుట మండల సర్పంచ్​ల ఫోరం ఆధ్వర్యంలో సర్పంచ్​లు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్​ల ఫోరం మండల కార్యదర్శి నరియానాయక్​ మాట్లాడుతూ.. ఏడు నెలలుగా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద చేసిన సీసీ రోడ్ల బిల్స్ ఏడాది కాలంగా  ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని వాపోయారు.  గ్రామాల్లో కనీసం కరెంట్​బల్బులు కూడా వేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు చెల్లించక పోతే  ఆందోళన  మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  సర్పంచ్​లు నాగరాజు, గోపాల్​నాయక్​, లక్ష్మణ్​, అయ్యన్న, శివయ్య, జగన్​, సీత్య తదితరులు పాల్గొన్నారు.

లోకాయుక్త తీర్పును స్వాగతిస్తున్నాం

కోదాడ, వెలుగు: పట్టణంలోని మసీదు కాంప్లెక్స్ షాపులను వేలం వేయాలని లోకాయుక్త ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కోదాడ పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు మహమ్మద్, ఉపాధ్యక్షుడు బాషుమియా తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో ప్రెస్​మీట్​లో వారు మాట్లాడారు. లోకాయుక్త నుంచి తమకు సంబంధిత ఉత్తర్వులు అందాయని చెప్పారు. కాంప్లెక్స్​ షాపులను వేలం వేయడానికి  వక్ఫ్ బోర్డు ఆఫీసర్ల నుంచి ఆదేశాలు రావాలన్నారు. ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఓపెన్ యాక్షన్​ నిర్వహిస్తామన్నారు. మసీదు కాంప్లెక్స్​షాపుల ఆదాయం ప్రస్తుతం  నెలకు రూ. 2.75 లక్షలు  వస్తుందని చెప్పారు. ఈ మీటింగ్​లో పలువురు మసీదు కమిటీ  లీడర్లు, బిల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.