SBI Alert: వాట్సాప్ యూజర్లకు స్టేట్ బ్యాంక్ హెచ్చరిక.. పాటించకపోతే నష్టమే..

SBI Alert: వాట్సాప్ యూజర్లకు స్టేట్ బ్యాంక్ హెచ్చరిక.. పాటించకపోతే నష్టమే..

SBI News: ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో మోసగాళ్లు ప్రజలను దూరం నుంచే టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లను వారు ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. అయితే ప్రజలు సర్వసాధారణంగా వినియోగించే వాట్సాప్ ఎక్కువగా మోసగాళ్లకు అడ్డాగా మారిపోతోంది. ఫేక్ ఏపీకే ఫైల్స్ లేదా అకౌంట్ల ద్వారా యూజర్లను నేరగాళ్లు టార్గె్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. కొందరు మోసగాళ్లు సోషల్ మీడియాలో బ్యాంక్ పేరుమీద ఫేక్ వీడియో విడుదల చేసి తమ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. స్టేట్ బ్యాంక్ స్టాక్ మార్కెట్ చిట్కాలను అందిస్తుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు సర్క్యులేట్ చేస్తున్నట్లు బ్యాంక్ హెచ్చరించింది. 

నిందితులు కేవలం వారం రోజుల్లో డబ్బును రెట్టింపు చేసే స్టాక్ మార్కెట్ పెట్టుబడి చిట్కాలను అందిస్తామని తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. అలాంటి వారు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ప్రజలను చేర్చుకుని మోసగిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. తాము అలా బాధ్యతారహితమైన రాబడికి హామీ ఇస్తూ ఎలాంటి స్కీమ్స్ ఆఫర్ చేయబోమని వెల్లడించింది. 

స్టేట్ బ్యాంక్ సలహా..
1. అధిక రాబడులను ఆశచూపుతూ వచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మెుద్దని బ్యాంక్ పేర్కొంది.
2. స్టేట్ బ్యాంక్ అందించే సేవలను నిర్థారించుకోవటానికి సమీపంలోని ఏదైనా బ్యాంక్ శాఖను సందర్శించటం లేదా అధికారిక వెబ్ సైట్లో పరిశీలించాలని బ్యాంక్ కోరింది. 
3. తప్పుడు వాట్సాప్ గ్రూపుల గురించి తమ దృష్టికి వస్తే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.
4. అధికారిక సోర్సెల్ లేదా యాప్ ద్వారానే సేవలను పొందాలని బ్యాంక్ పేర్కొంది.

ఏదైనా బ్యాంక్ పేరుతో ఇలా ఉచిత పెట్టుబడి టిప్స్ అందిస్తామంటూ వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో నిందితులు సంప్రదిస్తే వెంటనే అప్రమత్తమే సదరు విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు లేదా బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లటం మంచిది. ఇది ఇతరులు మోసపోవటాన్ని కూడా అరికట్టడానికి సహాయపడుతుంది.