
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన లెండింగ్ రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు ఆదివారం నుంచి అమలులోకి వస్తుంది. ఎస్బీఐ తన ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటు (ఈబీఆర్/ఈబీఎల్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు (0.50శాతం) తగ్గించింది. దీంతో కొత్త ఈబీఆర్ 8.65 శాతం నుంచి 8.15శాతానికి తగ్గింది. హోం, ఎంఎస్ఎంఈ సహా సహా వివిధ ఫ్లోటింగ్ రేటు లోన్లకు ఇది వర్తిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు కోతకు అనుగుణంగా, ఎస్బీఐ తన హోంలోన్ వడ్డీ రేట్లను 7.50శాతం నుంచి 8.45శాతం వరకు సవరించింది. కస్టమర్ల సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ రేట్లు మారుతాయి.
హోమ్ లోన్ మ్యాక్స్ గెయిన్ ఓడీ వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 8.70 శాతం వరకు ఉంటుంది. టాప్ అప్ హోమ్ లోన్ వడ్డీ రేటు 8శాతం నుంచి 10.50శాతం వరకు ఉంటుంది. అన్ని హోంలోన్లు ఎక్స్టర్నల్బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) ప్రకారం ఉంటాయి. ఎంసీఎల్ఆర్లో మార్పు లేదని బ్యాంకు ప్రకటించింది. ఎస్బీఐ అమృత్ వృష్టి (444 రోజులు) అనే ప్రత్యేక డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.85శాతం నుంచి 6.60శాతానికి మార్చింది. డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్ల (రూ.3 కోట్లకు లోపు) రేట్లను ప్రస్తుతానికి మార్చలేదు.