న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. వరల్డ్ బ్యాంక్ / ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని అందజేశారు. 'వరల్డ్ బెస్ట్ కన్జూమర్ బ్యాంక్2025', 'భారతదేశంలో ఉత్తమ బ్యాంక్ 2025' అనే రెండు టైటిల్స్ను గెలుచుకుంది. ఈ అవార్డులు తమ కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాలను అందించడానికి చేస్తున్న కృషికి గుర్తింపు అని ఎస్బీఐ పేర్కొంది.
ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ, 52 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని, రోజుకు 65 వేలు కొత్త కస్టమర్లను చేర్చుకుంటున్నామని చెప్పారు. ఎస్బీఐ రెండు ప్రతిష్టాత్మక టైటిళ్లను అందుకున్నందుకు గర్వంగా ఉందంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్లో రాశారు.
