10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపోరేట్లను తగ్గించనప్పటికీ, ఎస్బీఐ మాత్రం ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్)ను తగ్గించింది. ఏడాది టైం కలిగిన డిపాజిట్లపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఇది ఎనిమిది శాతం నుంచి 7.90 శాతానికి దిగివచ్చింది. ఎంసీఎల్ఆర్ ప్రకారం ఇచ్చే హౌసింగ్, వెహికిల్, ఇతర లోన్లపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ఈ నెల పదో తేదీ నుంచి కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడం ఇది ఎనిమిదోసారి. అయితే రెపో లింక్డ్ లోన్లపై, ఎఫ్డీలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. బ్యాంకులకు నిధులు లభించే రేటునే ఎంసీఎల్ఆర్ అంటారు. రాబోయే ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు రెపోరేట్లను మార్చబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ధరలు కూడా పెరుగుతున్నందున రేట్లను యథాతథంగా ఉంచినట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.